కేసీఆర్‌ వల్లనే కృష్ణా జలాల్లో వాటా తగ్గింది

– విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తే ఏం పోయేది
– కేసీఆర్‌ కాసీం రజ్వీలాంటోడు…అమిత్‌షా అభినవ పటేల్‌ : మీడియాతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజరు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సీఎం కేసీఆర్‌ తీరు వల్లనే కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటా తగ్గిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజరు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తే ఏమి పోయేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆదివారం పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన విమోచన దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ నిజాం సమాధి వద్ద మోకరిల్లారని విమర్శించారు. కేసీఆర్‌ కాసీం రజ్వీ లాంటోడన్నారు. అమిత్‌షా అభినవ సర్దార్‌ వల్లభబాయి పటేల్‌ అని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వమే గతేడాది నుంచి ఉత్సవాలు నిర్వహిస్తున్నదన్నారు. కేసీఆర్‌ కంటే ముందే బీజేపీ ఒక్కఓటు రెండు రాష్ట్రాల తీర్మానం చేసిందన్నారు. చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇవ్వకపోతే కేసీఆర్‌కు తెలంగాణ ఉద్యమం గుర్తొంచిందన్నారు. ఈఎస్‌ఐ, సహారా స్కామ్‌లలో ఇరికిన సీఎం కేసీఆర్‌ను మన్మోహన్‌ సింగ్‌ రాజీనామా చేయమనగానే మళ్లీ జై తెలంగాణ నినాదం ఎత్తుకున్నారని విమర్శించారు. తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పుడూ, ఓటి సమయంలోనూ ఆయన లేరని గుర్తుచేశారు. ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేయడం వల్ల తెలంగాణ సిద్ధించిందన్నారు. మంత్రి పదవి కోసం తన కొడుకు పేరును కేటీఆర్‌ అని మార్చుకున్న చరిత్ర కేసీఆర్‌ది అని విమర్శించారు. కొడుకు కేటీఆర్‌, కూతురు కవితపైనా అనేక ఆరోపణలు, కేసులున్నాయన్నాని చెప్పారు.

Spread the love