ఇంజినీరిగ్ విద్యార్థులకు జేఎన్‌టీయూ గుడ్‌న్యూస్…

నవతెలంగాణ – హైద‌రాబాద్ : జేఎన్‌టీయూ ప‌రిధిలో ఇంజినీరింగ్ చ‌దువుతున్న విద్యార్థుల‌కు శుభ‌వార్త‌. ఒక కాలేజీ నుంచి మ‌రొక కాలేజీకి విద్యార్థులు ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యేందుకు అనుమతిస్తూ జేఎన్‌టీయూ సోమవారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఒక కాలేజీ నుంచి మరో కాలేజీకి, ఒక యూనివర్సిటీ నుంచి మరో యూనివర్సిటికి, అటానమస్‌ కాలేజీ నుంచి నాన్‌ అటానమస్‌ కాలేజీకి, ఇలా రకరకాల పద్ధతిలో విద్యార్థులకు ట్రాన్స్‌పర్‌ చేసుకునే అనుమతి కోరుతూ విద్యార్థులు దరఖాస్తు కోరుతారు. స్టూడెంట్‌ ట్రాన్స్‌ఫ‌ర్లు అనేక కారణాలతో ముడిపడి ఉంటాయి. అందులో ప్రధానంగా ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి. ఇలాంటి సందర్భంలో విద్యార్థుల విద్యా సంవత్సరం నష్టపోకుండా ప్రభుత్వం స్టూడెంట్‌ ట్రాన్స్‌ఫ‌ర్‌ అయ్యే వెసులుబాటు కల్పించింది. ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి అనుగుణంగా జేఎన్‌టీయూ వీసీ ప్రొఫెసర్‌ కట్టా నరసింహారెడ్డి ఈ ఏడాదిలో స్టూడెంట్‌ ట్రాన్స్‌ఫర్ల కోసం అనుమతులు మంజూరు చేశారు. ఇందుకు సంబంధించిన నిబంధనలు అన్ని అఫిలియేషన్‌, అటానమస్‌ కాలేజీలతో పాటు యూనివర్సిటీ కాలేజీలకు కూడా వర్తించ‌నున్నాయి. ఈ నిబంధనలు వెంటనే అమలు చేయాలని యూనివర్సిటీ అకడమిక్‌ అండ్‌ ప్లానింగ్‌ అధికారిని ఆదేశించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారమే స్టూడెంట్‌ ట్రాన్స్‌ఫర్లు ఉంటాయని ఆ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ మంజూర్‌ హుస్సేన్‌ తెలిపారు. ఫస్టియర్‌ నుంచి ఫస్టియర్‌కు రూ.10 వేలు, సెకండియర్‌ నుంచి సెకండియర్‌కు రూ.15 వేలు, థర్డ్‌ ఇయర్‌ నుంచి థర్డ్‌ ఇయర్‌కు రూ. 20 వేలు, ఫోర్త్‌ ఇయర్‌ నుంచి ఫోర్త్‌ ఇయర్‌కు రూ.25 వేల చొప్పున స్టూడెంట్‌ ట్రాన్స్‌ఫర్‌ ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని, ఈ మేరకు కాలేజీ యాజమన్యాలు తగిన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. అయితే ఇందుకు సంబంధించిన నిబంధనలు గతేడాది మార్చిలో ప్రభుత్వం జీవో జారీ చేసిన దాని ప్రకారం అమలు చేస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు జేఎన్టీయూ అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌ విభాగంలో పొందుపరిచినట్లు యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు.

Spread the love