నవతెలంగాణ-కామారెడ్డి: అత్యవసర పరిస్థితులు, విపత్తుల సమయంలో జిల్లా స్థాయి సన్నద్ధత, శాఖల మధ్య సమన్వయం, స్పందన వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రాష్ట్రస్థాయి టేబుల్టాప్ ఎక్సర్సైజ్లో కామారెడ్డి జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఐడీఓసీసీ కలెక్టరేట్ నుంచి ఆన్లైన్ విధానంలో నిర్వహించబడగా, జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ టేబుల్టాప్ ఎక్సర్సైజ్లో పాల్గొని జిల్లా సన్నద్ధత చర్యలను సమీక్షించారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్, అదనపు కలెక్టర్ గిరి (లోకల్ బాడీస్)తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరై అత్యవసర పరిస్థితుల్లో శాఖల బాధ్యతలు, సమన్వయంపై చర్చించారు.
ఈ సందర్భంగా విపత్తు స్పందన వ్యవస్థలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, అత్యవసర సన్నద్ధత, సహజ, మానవసృష్టి విపత్తుల సమయంలో తక్షణ చర్యలపై ప్రధానంగా దృష్టి సారించారు. అధికారులు వివిధ అత్యవసర పరిస్థితులను ఊహించి, వాటికి అనుగుణంగా అమలు చేయాల్సిన వ్యూహాలను సమీక్షించారు. ఇలాంటి టేబుల్టాప్ ఎక్సర్సైజ్లు శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడమే కాకుండా, అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా స్థాయి సన్నద్ధతను పెంపొందించడంలో ఉపయోగకరంగా ఉంటాయని అధికారులు తెలిపారు.



