నవతెలంగాణ – హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యశోద ఆస్పత్రి నుంచి శుక్రవారం ఉదయం డిశ్చార్జ్ అయ్యారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్.. నేరుగా బంజారాహిల్స్ నంది నగర్లోని తన సొంతింటికి వెళ్లారు. హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ కారణంగా కేసీఆర్ యశోద ఆస్పత్రిలో వారం రోజుల పాటు ఉన్నారు. చికిత్స అనంతరం కేసీఆర్ కోలుకోవడంతో.. వైద్యులు ఇవాళ డిశ్చార్జ్ చేశారు. మరో నాలుగైదు వారాల పాటు కేసీఆర్ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ నెల 8వ తేదీన రాత్రి కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో కాలు జారి కింద పడిన సంగతి తెలిసిందే. దీంతో కేసీఆర్ను కుటుంబ సభ్యులు సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. 9వ తేదీన కేసీఆర్ హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ నిర్వహించారు. ఆ తర్వాత కేసీఆర్ను వాకర్ సాయంతో వైద్యులు నడిపించారు. ఇక ఆస్పత్రిలో ఉన్న కేసీఆర్ను రాజకీయ, సినీ ప్రముఖులు పరామర్శించిన సంగతి తెలిసిందే.