Thursday, September 10, 2026
E-PAPER
Homeజాతీయంఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండాకు 
కేరళం తలొగ్గక్కర్లేదు

ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండాకు 
కేరళం తలొగ్గక్కర్లేదు

- Advertisement -

వందేమాతరం రెండు చరణాలు పాడితే చాలు : 
ప్రతిపక్ష నేత పినరయి విజయన్‌

తిరువనంతపురం :ప్రభుత్వ కార్యక్రమాల్లో వందేమాతరం గేయాన్ని పూర్తిగా ఆలపించాలన్న ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండాను తప్పనిసరిగా కేరళం అమలు చేయాల్సిన అవసరం లేదని ప్రతిపక్ష నేత పినరయి విజయన్‌ ‌శుక్రవారం స్పష్టం చేశారు. ఈ గేయంలో మత ప్రస్తావనులు ఉన్న మిగిలిన భాగాలను వదిలేసి కేవలం దేశ ఔన్నత్యాన్ని చాటే రెండు చరణాలను మాత్రమే ఆలపించడం సంప్రదాయమని ఆయన గుర్తు చేశారు. అయితే సంఘ్‌ ‌పరివార్‌ ఎజెండాతో మొత్తం గేయాన్ని ఆలపించాలంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ మధ్య ఉత్తర్వులు జారీ చేసిందని, అయితే వాటిని లౌకిక వాద ప్రభుత్వాలు తమ హాయంలో కేరళ, అలాగే తమిళనాడు తిప్పికొట్టాయని ఆయన తెలిపారు. అందువల్ల ఇప్పుడు కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో వందేమాతరం గేయంలోని రెండు చరణాలు మాత్రమే ఆలపించడం అవసరమని అన్నారు. లౌకిక జాతీయ గీతం స్థానంలో మత ప్రస్తావనలున్న వందేమాతరాన్ని ప్రవేశపెట్టాలన్న సంఘపరివార్‌ ‌విభజనపూరిత ఎత్తుగడను కేరళం ప్రతిఘటించాలని అన్నారు. వందేమాతరం సభలో ఆలపిస్తున్నప్పుడు ప్రతిపక్ష సభ్యులు కూడా లేచి నిలబడి గౌరవించారు కదా? అన్న ప్రశ్నకు విజయన్‌ ‌బదులిస్తూ.. ‘‘జాతీయ గీతం ఆలపిం చేటపుడు పౌరులు తమ సీట్ల నుంచి లేచి గీతాలా పన పూర్తయ్యేవరకు నిలబడే వుండాలి. వందేమా తరానికి అలాంటిదేమీ అవసరం లేదు. పోలీసు బ్యాండ్‌ జాతీయ గీతం తొలి చరణాలు వాయిం చేటపుడు ‌పాలక పక్షాలు లేచి నిలబడ్డాయి. సభలోని సాధారణ భావనకు గౌరవమిస్తూ ప్రతిపక్షం కూడా అదే అనుకరించింది’’ అని విజయన్‌ ‌చెప్పారు.

అత్యంత నిస్సిగ్గుగా 
బీజేపీ పక్షాన నిలిచిన కాంగ్రెస్‌ ..
కాంగ్రెస్సేతర ప్రతిపక్ష నేతలను రాజకీయంగా లక్ష్యం చేసుకోవడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలను ముఖ్యంగా ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ (ఈడీ )ని కేంద్ర ప్రభుత్వం ఉపయోగిస్తున్నపుడు కాంగ్రెస్‌ అత్యంత నిస్సిగ్గుగా బీజేపీ పక్షాన నిలిచిందని విజయన్‌ ‌విమర్శించారు. తమ నేతలపై ఈడీ ని ఉపయోగించేటపుడు తీవ్రంగా నిరసనలు వ్యక్తం చేసిన కాంగ్రెస్‌ ఇప్పడు ప్రతిపక్ష నేతలపై ఈడీ దాడులు చేస్తుంటే మాత్రం ఆనందంగా చూస్తోందని విమర్శించారు. తమ ఇంటిపై ఈడీ దాడులను ఆప్‌ ‌నేత కేజ్రివాల్‌, డీఎంకే నేత స్టాలిన్‌, ఇతర ఇండియా బ్లాక్‌‌ నేతలు తీవ్రంగా నిరసించారని విజయన్‌‌ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై యూడీఎఫ్‌ ఎందుకు మౌనంగా వుందో ముఖ్యమంత్రి సతీశన్‌ ‌సమాధానం చెప్పాలని అన్నారు. ఇడి అధికారులు తననేమీ ప్రశ్నించలేదన్నారు. అయితే తన కుమార్తె వీణ బ్యాంక్‌ ‌ఖాతాను స్తంభింపచేసిన విషయాన్ని ధృవీకరించారు.

రాష్ట్రాభివృద్ధికి సూచనలు 
లేని గవర్నర్‌ ప్రసంగం
రాష్ట్ర భవిష్యత్‌, ప్రజల సంక్షేమం, అభివృద్ధికి దోహదపడే సూచనలేవీ గవర్నర్‌ ‌ప్రసంగంలో లేవని విజయన్‌ ‌విమర్శించారు. కొత్త ప్రభుత్వం ఇంకా ప్రారంభ దశలోనే వున్నందున ఈ దశలోనే తాను కఠినంగా మాట్లాడాలనుకోవడం లేదన్నారు. వారి చర్యలను నిశితంగా పరిశీలిస్తామని చెప్పారు. ఎల్‌‌డీఎఫ్‌ ‌ప్రభుత్వం గద్దె దిగేనాటికి ఖజానాలో రూ.5,429 కోట్ల నగదు బ్యాలెన్స్‌ ‌వుందని, ఇది కొత్త ప్రభుత్వం తన తొలి కార్యక్రమాలు చేపట్టడానికి ఉపకరిస్తుందని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -