నెట్టెంపాడు భూసేకరణ 45 రోజుల్లోగా పూర్తవ్వాలి
సమస్యలను పరిష్కరించి ముందుకెళ్లాలి
అలా అయితేనే సకాలంలో ప్రాజెక్టులు పూర్తి : ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్
నవతెలంగాణ – జోగులాంబగద్వాల
జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా వివిధ ప్యాకేజీల పరిధిలో సేకరించాల్సిన భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని ఆర్అండ్ఆర్ (రీహాబిలిటేషన్, రీసెటిల్మెంట్) కమిషనర్ శివకుమార్ నాయుడు అధికారులను ఆదేశించారు. మొత్తం 534 ఎకరాలలో ఎలాంటి ఇబ్బందులూ లేని భూసేకరణ ప్రక్రియను ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 రోజుల్లోగా పూర్తి చేయాలని చెప్పారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని నెట్టెంపాడు, గట్టు ఎత్తిపోతల పథకాలతోపాటు మల్లమ్మకుంట రిజర్వాయర్కు అవసరమైన భూసేకరణపై మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులతో కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్అండ్ఆర్ కమిషనర్ మాట్లాడుతూ.. ఆయా ప్రాజెక్టుల పరిధిలో భూసేకరణ ఆలస్యం కావడంపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారని, ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించి ముందుకెళ్లాల్సిందిగా ఆదేశించారని అన్నారు. గట్టు ఎత్తిపోతల పథకానికి సంబంధించి 462 ఎకరాలను, ఆర్డీఎస్ పరిధిలోని తుమ్మిళ్ల ఎత్తి పోతల పథకంలో భాగంగా ఫేజ్-2 కింద నిర్మిస్తున్న మల్లమ్మకుంట రిజర్వాయ ర్కు 567 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందన్నారు.
నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ప్రారంభమై చాలా ఏండ్లు కావడంతో భూసేకరణ విషయంలో మొదటి ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్లాలని సూచించారు. నెట్టెంపాడు పరిధిలో మొత్తం 534 ఎకరాల్లో కోర్టు కేసులు, ఇతర సమస్యలు లేని సుమారు 220 ఎకరాలకు ఈనెల 15వ తేదీలోగా ప్రిలిమినరీ డిక్లరేషన్ ఇవ్వాలన్నారు. ఆయా ప్రాజెక్టుల పరిధిలో భూసేకరణ పూర్తయితేనే ఎత్తిపోతల పథకాల పనులను సకాలంలో పూర్తిచేసి ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు వీలుంటుందన్నారు. జిల్లాలోని వివిధ రిజర్వాయర్లలో ముంపుకు గురైన గ్రామాల ప్రజలకు పునరావాస కేంద్రాల్లో ఆవాసం కల్పించినందున పెండింగ్లో ఉన్న మౌలిక సదుపాయాల పనులను వెంటనే చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కృష్ణ, ఇరిగేషన్ శాఖ సీఈ రహీముద్దీన్, సర్వే ఏడి నూకరాజు, కలెక్టరేట్ ఏవో భూపాల్రెడ్డి, తహసీల్దార్లు, నీటి పారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.



