నవతెలంగాణ – ఢిల్లీ: భూ కుంభకోణం కేసులో రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్కు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో ఆయన సతీమణి రబ్రీదేవి, ఆయన కుమారుడు, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, కుమార్తె, ఆర్జేడీ ఎంపీ మీసా భారతీలకు కూడా బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లాలూ కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో రైల్వేలో ఉద్యోగాలు ఇప్పించేందుకు కొందరు అభ్యర్థుల నుంచి భూములు తీసుకున్నారన్న అభియోగాలపై ఆయనతోపాటు మరో 15 మందిపై గతేడాది మే 18న సీబీఐ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. అదే ఏడాది అక్టోబరులో తొలి ఛార్జీషీట్ను దాఖలు చేయగా, ఈ ఏడాది జులై 3న మరో ఛార్జ్షీట్ను సమర్పించింది. ఈ ఏడాది సెప్టెంబరు 22న ఈ కేసులో విచారణకు హాజరుకావాలని నిందితులకు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో లాలూ ప్రసాద్ దిల్లీలో రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. బుధవారం లాలూ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ గీతాంజలి గోయల్ బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.