– వృద్ధులకు, పశువులకు తీవ్ర గాయాలు
నవతెలంగాణ-నడికూడ
వరంగల్ జిల్లాలోని నడికూడ మండలంలోని సర్వాపూర్ గ్రామంలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తూ పశువులు, వృద్ధులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ సంఘటన శనివారం జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పిచ్చికుక్కల దాడిలో గాయపడిన అన్నబోయిన బుచ్చమ్మ (90), భోగి ఎల్లమ్మ (75)లను వెంటనే పరకాలలోని ప్రభుత్వ్ర ఆసుపత్రికి తరలించారు. అయితే, వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో తీవ్రంగా గాయపడిన బుచ్చమ్మను వరంగల్లోని ఎంజిఎం ఆసుపత్రికి, ఎల్లమ్మను కమలాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుక్కలు అన్నబోయిన మల్లయ్య పశువులపైనా దాడి చేసి గాయపరిచాయి. అయితే రెండు నెలలక్రితం కుక్కలు వృద్దులపైనా, చిన్నపిల్లలపైనా, పశువులపై దాడి చేసి గాయపరిచినా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. సర్వాపూర్, కౌకొండ గ్రామాలలో ఐదు పశువులు మృతిచెందాయి. సర్వాపూర్లో గత సంవత్సరం నుండి వింత రోగాలతో కుక్కలు స్కిన్ ఇన్ఫెక్షన్లతో భయంకరంగా కనిప ిస్తున్నాయి. ఇప్పటివరకు సంబంధిత అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు.ఈ కుక్కల దాడితో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. పది రోజులు ఆగితే పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తారు. ఈ పిచ్చికుక్కల దాడి నుండి పిల్లలను ఎలా రక్షించుకోవాలని తల్లిదండ్రులు కూడా జంకుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని గ్రామాలలో కుక్కలు లేకుండా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.