బట్టల దుకాణం దగ్ధం..
కోట్లలో ఆస్తి నష్టం
• మూడు గంటలపాటు
మంటలను ఆర్పేసిన
అగ్నిమాపక సిబ్బంది
నవతెలంగాణ-హైదరాబాద్
వేసవి కాలంలో హైదరాబాద్ నగరంలో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా పాతబస్తీలోని మదీనా ఫత్తర్ఘట్టి ప్రాంతంలో ఉన్న ఎస్వైజే కాంప్లెక్స్లో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాంప్లెక్స్ మొదటి అంతస్తులో ఉన్న ‘యూనిస్ కిడ్స్ వేర్’ బట్టల దుకాణంలో ఉదయం సుమారు 9 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో భారీ మొత్తంలో వస్త్ర సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు 8 ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని భారీ క్రేన్ల సహాయంతో సుమారు మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిప్రమాదం ప్రభావంతో ఎస్వైజే కాంప్లెక్స్ మొదటి అంతస్తులోని విజయ డయాగ్నస్టిక్ సెంటర్తో పాటు రెండో అంతస్తులో ఉన్న కెనరా బ్యాంక్లోని కొంత ఫర్నీచర్ కూడా కాలిపోయినట్టు తెలిసింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక అంచనాల ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం సంభవించినట్టు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనలో సుమారు రూ.2 కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించినట్టు అంచనా వేస్తున్నారు.
పాతబస్తీ మదీనాలో భారీ అగ్నిప్రమాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



