నవతెలంగాణ – పశ్చిమ బెంగాల్: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద టాప్ రెజ్లర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. వీరి ఆందోళనపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందిచకపోగా.. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో రెజ్లర్లు ఆదివారం కొత్త పార్లమెంటు భవనం వైపు ర్యాలీగా వెళ్తుండగా ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్, భజరంగ్ పునియాతో పాటు ఇతర ఆందోళనకారులను నిర్బంధించి పోలీస్ స్టేషన్లకు తరలించి, రెజ్లర్లపైనే కేసులు నమోదుచేశారు. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. రెజ్లర్ల పట్ల పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు. ‘సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్ సహా ఇతర రెజ్లర్ల పట్ల ఢిల్లీ పోలీసులు అసభ్యకరంగా ప్రవర్తించిన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. వారిని వెంటనే విడుదల చేయాలి. మన చాంపియన్ల పట్ల ఈ విధంగా వ్యవహరించడం సిగ్గుచేటు. రెజ్లర్లకు అండగా నిలుస్తాను’ అని పేర్కొన్నారు.