– మందుపాతర పేలి గిరిజనుడికి గాయాలు
నవతెలంగాణ-చర్ల
పోలీసులను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు అమర్చిన ఐఈడీ మందు పాతర పేలి గిరిజనుడికి తీవ్ర గాయాలైన ఘటన ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా, పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మవరం గ్రామానికి చెందిన సబ్కా చంద్రయ్య మంగళవారం ఉదయం చేపలు పట్టడానికి వెళుతుండగా పోలీసులను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు అమర్చిన ఐఈడీ మందు పాతర పేలడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన గ్రామస్తులు చంద్రయ్యను జెట్టీలో తీసుకొని వెళుతుండగా 204 కోబ్రా, 151 సీఆర్పీఎఫ్ బెటాలియన్ సిబ్బంది గమనించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. పామేడు ఫీల్డ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అక్కడ అతనికి డాక్టర్ తరుణ్ మాలిక్ చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం భద్రాచలం తరలించారు. చంద్రయ్య కుడి కాలును తొలగించారు. ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందుతున్నాడు.