గురక నిద్ర అనారోగ్యానికి దారి తీస్తుంది : మంత్రి హరీశ్‌ రావు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గురక నిద్ర అనారోగ్యానికి దారి తీస్తుందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. ఆదివారం రాష్ట్రంలో మొట్ట మొదటి స్లీప్‌ థెరపెటిక్స్‌ కేంద్రాన్ని హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురక నిద్ర అనేక అనర్థాలకు కారణమవుతుందని చెప్పారు. దీంతో పాటు నిద్ర రాకపోవడం, నిద్రలో నడవడం, అతిగా నిద్ర పోవడం వంటి సమస్యలకు స్లీప్‌ థెరపెటిక్స్‌ ‘కేంద్రం ఎంతో ఉపయోగ పడుతుందని హరీష్‌ రావు తెలిపారు. గురక నిద్ర, నిద్ర లేమీ సమస్యలు ప్రతి ఒక్కరికీ ఇబ్బంది కలిగిస్తున్నాయని, అలాంటి వారికి స్లీప్‌ థెరపెటిక్స్‌ కేంద్రంలో చక్కని పరిష్కారం దొరుకుతుందని వివరించారు. ఈ కేంద్రం వ్యవస్థాపక డైరెక్టర్‌ డాక్టర్‌ హర్శిని ప్రతీక్‌ వినూత్న ఆలోచనలకు రూప కల్పన చేశారని హరీష్‌ రావు ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, శాసన మండలి చీఫ్‌ విప్‌ టీ.భాను ప్రసాద్‌ రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Spread the love