99 లక్షల మంది పిల్లలకు డీ వార్మింగ్‌

– నులిపురుగుల నివారణకు ట్యాబ్లెట్ల పంపిణీ
– నేడు ప్రారంభించనున్న మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 99 లక్షల మంది విద్యార్థులకు ఆల్బెండజోల్‌ ట్యాబ్లెట్లను పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలోని 1-19 ఏండ్ల మధ్య వయసున్న వారికి ట్యాబ్లెట్ల పంపిణీని కార్యక్రమాన్ని హైదరాబాద్‌ నారాయణగూడలోని మాడపాటి హనుమంతరావు బాలికల ఉన్నత పాఠశాల వేదికగా వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. ఏదైనా కారణం వల్ల గురువారం ట్యాబ్లెట్లు తీసుకోలేని విద్యార్థుల కోసం ఈ నెల 27వ తేదీన మరోసారి డీవార్మింగ్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. గతేడాది 96.47 లక్షల మందికి ట్యాబ్లెట్లు పంపిణీ చేయగా.. ఈ సారి అదనంగా సుమారు 2.5 లక్షల మంది పిల్లలు పెరిగారు. అంగన్వాడీలు, ప్రభుత్వ, ప్రయివేట్‌ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, ఇంటర్‌ కాలేజీల్లో డీవార్మింగ్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. స్కూల్‌ బయట ఉన్న పిల్లలకు ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ హెల్పర్ల సాయంతో ఆయా కేంద్రాల్లో ట్యాబ్లెట్లు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 41,337 మంది టీచర్లకు, 35,700 మంది అంగన్‌వాడీలకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చింది.
నులి పురుగులు ఇలా…
పిల్లల శరీరాల్లోకి వివిధ మార్గాల ద్వారా నులిపురుగులు చేరతాయి. కలుషిత ప్రాంతాల్లో చెప్పులు లేకుండా నడవడం, కలుషితమైన నీరు, ఆహారం తీసుకోవడం చేతులు శుభ్రం చేసుకోకుండా తినడంతోపాటు సరిగా ఉడకని మాంసం ద్వారా, పెంపుడు జంతువుల ద్వారా ఇవి శరీరంలోకి చేరుతాయని నిపుణులు చెబుతున్నారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఇవి పొట్టలోకి చేరుతాయి. పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత, శారీరక, మానసిక ఎదుగుదల సరిగా లేకపోవడం, తరుచూ తీవ్రమైన కడుపునొప్పి రావడం వంటి సమస్యలకు దారి తీస్తాయి. ఈ సమస్యల బారి నుంచి పిల్లలను రక్షించేందుకు ప్రభుత్వం ఏటా ‘డీ వార్మింగ్‌ డే’ను నిర్వహిస్తున్నది. తీపి పదార్థాలు తినాలనే కోరిక పెరగడం, తరుచూ కడుపు నొప్పి, ఎక్కువగా ఆకలి కావడం, తలనొప్పి, మట్టి తినడం, తలలో పేలు పెరగడం వంటివన్నీ నులిపురుగులు ఉన్నాయనడానికి సంకేతాలని నిపుణులు పేర్కొంటున్నారు. వీటి నివారణకు ఆల్బెండజోల్‌ ట్యాబ్లెట్లు వేయడం ఉత్తమ మార్గమని, ప్రపంచవ్యాప్తంగా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారని వారు తెలిపారు.
వయస్సు ఆధారంగా డోసు
ఈ టాబ్లెట్లను వయస్సు ఆధారంగా వేయనున్నారు. 1-2 ఏండ్ల పిల్లలకు సగం ట్యాబ్లెట్‌ను పొడిగా మార్చి నీళ్లలో కలిపి ఇస్తారు. 2-3 ఏండ్లవారికి ఒక ట్యాబ్లెట్‌ను పొడిగా మార్చి, నీళ్లలో కలిపి తాగిస్తారు. 3-19 ఏండ్ల వారికి ట్యాబ్లెట్‌ను చప్పరించాలని సూచిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం టీచర్ల పర్యవేక్షణలో జరుగుతుంది. ఖాళీ కడుపుతో ఉన్న విద్యార్థులకు ట్యాబ్లెట్‌ ఇవ్వరు. ఈ ట్యాబ్లెట్‌ వల్ల దుష్ప్రభావాలు దాదాపు ఉండవు. నులిపురుగులు ఎక్కువగా ఉన్న కొందరు విద్యార్థుల్లో మాత్రం కాస్త నీరసం, వాంతి వంటి లక్షణాలు కనిపిస్తాయని అధికారులు చెబుతున్నారు.

Spread the love