నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అడ్మిషన్లపై సమగ్ర సమాచారంతో ప్రముఖ విద్యావేత్త, రచయిత ఎన్ సుధీర్రెడ్డి రచించిన ‘కాలేజ్ అడ్మిషన్స్ డీకోడెడ్’ అనే పుస్తకాన్ని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం హైదరాబాద్లోని ఆమె నివాసంలో ఆవిష్కరించారు. అడ్మిషన్లపై సమగ్ర సమాచారంతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఉపయోగపడేలా పుస్తకాన్ని రచించిన సుధీర్ను మంత్రి అభినందించారు. ఇది అందరికీ ఒక దిశ చూపుతుందంటూ ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. రచయిత సుధీర్రెడ్డి మాట్లాడుతూ ఎంసెట్తోసహా వివిధ పోటీ పరీక్షలకు హాజరైన వారు తదుపరి చేరాల్సిన కోర్సులు, కళాశాలలు లాంటి వివరాలతో బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవటానికి ఈ పుస్తకం దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేమిరెడ్డి నరసింహారెడ్డి, ఎన్ చెన్నారెడ్డి, మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపాల్ డాక్టర్ టివి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.