విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపుదలకు ప్రత్యేక కార్యక్రమం

– విద్యార్థి దశలోనే వ్యాపార ఆవిష్కరణకు ప్రోత్సాహం : మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి
– జిల్లాకో పాఠశాలలో ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
విద్యార్థుల్లో సామాజిక-భావోద్వేగ నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించనున్నట్టు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. సోమవారం హైదరాబాద్‌లోని మంత్రి తన కార్యాలయంలో విద్యాశాఖ పని తీరుపై ఆమె సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో ఢిల్లీ తరహా విధానాన్ని ఇక్కడ అమలు చేయబోతున్నామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థుల విశ్వాసం, మానసిక, భావోద్వేగ శ్రేయస్సు, సామాజిక నైపుణ్యాలు దెబ్బతినకుండా వారిలో మనోస్థైర్యం కల్పించనున్నట్టు వివరిం చారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో జిల్లాకు ఒక పాఠశాల చొప్పున ఎంపిక చేసి ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు. విద్యార్థుల్లో ప్రతికూల పరిస్థితులను, ఇబ్బందులను తొలగించి భవిష్యత్‌ పట్ల ఆశావాద దృక్పథాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఇందుకోసం ఎంపిక చేసిన పాఠశాలల్లో ఇద్దరేసి ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అందించనున్నట్టు మంత్రి వివరించారు. విద్యార్థి దశలోనే వ్యాపార ఆవిష్కరణలను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. మొదటి దశలో ఎనిమిది జిల్లాల్లోని 24 మోడల్‌ స్కూళ్లను ఎంపిక చేసి 2,500 మంది విద్యార్థులను వ్యాపార ఆవిష్కరణల పట్ల ప్రోత్సహించనున్నట్టు మంత్రి తెలిపారు. ఇందులో మెరుగైన 1,500 ఆవిష్కరణలను ప్రోత్సహించి, ఒక్కో ఆవిష్కరణకు రూ.రెండు వేలను అందజేసి ప్రభుత్వం సహకరిస్తుందని పేర్కొన్నారు. ప్రత్యేక ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేసి, వారిని భవిష్యత్‌లో ఉత్తమ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు.

Spread the love