– మహిళా విశ్వవిద్యాలయం లోగో ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉన్నత విద్యలో మహిళలు ముందంజలో ఉండేందుకు వీలుగా తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశామని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆ విశ్వవిద్యాలయం ఏర్పాటుతో రాష్ట్ర విద్యార్థుల కల సాకారమయ్యిందనీ, ఉన్నత విద్యలో మహిళల భాగస్వామ్యం మరింతగా పెరిగిందని చెప్పారు. బుధవారం హైదరాబాద్లోని సచివాలయంలో ఆమె ‘తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం’ లోగో’ను విడుదల చేశారు. ‘లోగో’ను రూపొందించిన అధికారులను మంత్రి అభినందించారు. అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా నూతన కోర్సులను ప్రవేశపెట్టాలనీ, వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా సిలబస్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
బోధనా సౌకర్యాలు, విద్యార్థినులకు కావాల్సిన వసతులు, మౌలిక సదుపాయాలను ఎప్పటికప్పుడు మెరుగుపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నత విద్యా మండలి చైర్మెన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డి రవీందర్ యాదవ్, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం ఇన్చార్జి వైస్ చాన్సలర్ విజ్జులత తదితరులు పాల్గొన్నారు.