నవతెలంగాణ – హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ హఠాన్మరణం పట్ల రాష్ట్ర మంత్రులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం బాధాకరమని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. నిన్న మొన్నటి వరకు కలివిడిగా తిరిగిన జగదీష్ మరణం తనకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమకారుడిగా నాటి ఉద్యమంలో జగదీష్ చురుకైన పాత్ర పోషించార న్నారు. వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు మంత్రి ఎర్రబెల్లి తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు. కుసుమ జగదీష్ మరణం పట్ల రాష్ట్ర రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జగదీష్ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని, ఆయన ఆత్మకు సద్గతులు కలగాలని భగవంతున్ని ప్రార్థించారు.