మోడీ ఫొటో పెట్టలేదని…

Modi did not put photo...– బెంగాల్‌కు నిధులు నిలిపేసిన కేంద్రం
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌లోని రేషన్‌ దుకాణాల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఫొటోలు పెట్టలేదన్న కారణంతో జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఆ రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఏడు వేల కోట్ల రూపాయల నిధుల్ని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. నిధులు బదిలీ చేసేందుకు కేంద్రం రెండు షరతులు విధించిందని బెంగాల్‌ ఆహార శాఖ సీనియర్‌ అధికారులు తెలిపారు. అందులో ఒకటి… ప్రతి రేషన్‌ షాపు ముందు మోడీ చిత్రంతో బ్యానర్‌ లేదా ఫ్లెక్సీని ఏర్పాటుచేయాలి. రెండోది… పాయింట్‌-ఆఫ్‌-సేల్‌ పరికరం నుంచి జారీ అయ్యే అక్‌నాలెడ్జ్‌మెంట్‌ స్లిప్పు మీద జాతీయ ఆహార భద్రతా సంస్థ లోగో ఉండాలి. అయితే ఈ రెండు షరతులనూ పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిసింది. ‘మొదట కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక చేసింది. ఆ తర్వాత ఈ పథకం కింద రాష్ట్రానికి డబ్బు ఇవ్వకూడదని నిర్ణయించుకుంది’ అని ఓ అధికారి చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లోని ఆరు కోట్ల మంది లబ్దిదారుల కోసం ముఖ్యమైన ఆహార వస్తువులను కొనుగోలు చేసేందుకు ఈ మొత్తాన్ని ఉద్దేశించారు. కేంద్రం నిధులు నిలిపివేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యాన్ని సేకరించడం ప్రారంభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 70 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటి వరకూ అందులో 30శాతం మాత్రమే సేకరించగలిగింది. ఆహారం, పని హక్కులపై ప్రచారం నిర్వహిస్తున్న బెంగాల్‌ సంస్థ కేంద్ర నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం నియంతృత్వ ధోరణులు ప్రదర్శిస్తూ భయపెట్టాలని చూస్తోందని విమర్శించింది. రాష్ట్రంలో రాజకీయ కక్షతోనే గ్రామీణ ఉపాధి హమీ చట్టం, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద పథకాలను అడ్డుకుంటున్నారని ఆరోపించింది. కాగా ప్రజా పంపిణీ వ్యవస్థ బహుమతి కాదని, అది పౌరుల హక్కు అని పౌర సమాజ బృందం వ్యాఖ్యానించింది. ఈ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో భాగస్వామ్యాన్ని కొనసాగించాల్సిన కేంద్రం దానికి బదులుగా తన విజయాలపై గొప్పలు చెప్పుకునే విషయం పైనే దృష్టి కేంద్రీకరిస్తోందని విమర్శించింది.

Spread the love