నవతెలంగాణ – న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ సారధ్యంలో కొలువుదీరబోయే కొత్త మంత్రి వర్గంపై ఒక అంచనా వచ్చేసింది. క్యాబినెట్లో చోటు దక్కిన ఎంపీలకు పీఎంవో కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ వెళుతున్నాయి. కాసేపట్లో ప్రధాని మోడీ తన నివాసంలో నూతన మంత్రి వర్గ సభ్యులకు తేనేటి విందు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక.. కేంద్ర క్యాబినెట్లో ఇద్దరు బీజేపీ ఎంపీలకు చోటు లభించింది. బీజేపీ ఎంపీల్లో రామ్మోహన్నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్కు కాల్స్ వెళ్లాయి. అలాగే మిత్రపక్షాల ఎంపీల్లో కుమారస్వామి (జేడీఎస్), ప్రతాప్రావ్ జాదవ్లకు ఫోన్ కాల్స్ వెళ్లినట్లు సమాచారం. మరోవైపు బీజేపీ సీనియర్లు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పియూష్ గోయల్, జితేంద్రసింగ్, శర్బానంద సోనోవాల్, జ్యోతి రాధిత్య సింధియాలకు సైతం కబురు వెళ్లినట్లు సమాచారం. మంత్రి మండలిలో కిషన్రెడ్డిడీ, బండి సంజయ్ చోటు దక్కింది. కిషన్ రెడ్డి నివాసం నుంచి ఒకే కారులో వారు బయలుదేరి వెళ్లారు. ఇంకా ఎవరెవరికి కాల్స్ వెళ్లాయనేదానిపై కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నేటి సాయంత్రం కర్తవ్యపథ్లో ప్రధానిగా నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.