– వైరింగ్లో సమస్యలు..
న్యూఢిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) విక్రయిస్తోన్న ఎక్స్్యువి 700 మోడల్లోని ఒక లక్ష యూనిట్ల పైగా రీకాల్ చేస్తోన్నట్లు వెల్లడించింది. వాహనాల్లో వైరింగ్ విషయంలో లోపాలు గుర్తించామని ఆ కంపెనీ తెలిపింది. 2021 జూన్ 8 నుంచి 2023 జూన్ 28 మధ్య తయారైన 1,08,306 యూనిట్ల కార్లలోని ఇంజన్ బేలో వైరింగ్ లూమ్ రూటింగ్లో లోపాలు తలెత్తే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. వాటిలో తగు మార్పులు చేసి వినియోగదారులకు తిరిగి అప్పగించనున్నట్లు ఆ సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించింది. అదే విధంగా ఎక్స్యువి 400కు సంబంధించి 2023 ఫిబ్రవరి 16 నుంచి 2023 జూన్ 5 మధ్య తయారైన 3,560 యూనిట్లను రీకాల్ చేస్తోన్నట్లు పేర్కొంది. ఎక్స్యువి 400 వాహనాల్లో బ్రేక్ పొటెన్షియోమీటర్లో స్ప్రింగ్ రిటర్న్ యాక్షన్లో లోపాలు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ఈ కార్లు కొనుగోలు చేసిన వినియోగదారులకు ఎలాంటి చార్జీలు లేకుండానే స్వచ్ఛందంగానే మరమ్మతులు చేసి ఇస్తామని పేర్కొంది.