– అక్రమ అరెస్టులు చేయడం పిరికిపంద చర్య
– ఓబీసీ జిల్లా అధ్యక్షులు వాగుల్ దాస్ నిరంజన్ గౌడ్
నవతెగాణ – ఊరుకొండ
అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపడం ఎవరి తరం కాదని.. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును అక్రమంగా అరెస్టు చేయడం పిరికిపంద చర్య అని ఓబీసీ జిల్లా అధ్యక్షులు వాగుల్ దాస్ నిరంజన్ గౌడ్ అన్నారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రంలో ముదిరాజుల ఆరాధ్య దైవమైన పండగ సాయన్న విగ్రహాన్ని ద్వసం చేయడాన్ని నిరసిస్తూ.. లింగాల మండల కేంద్రంలో ధర్నా చేసేందుకు బయలుదేరిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, అతని అనుచరులను మార్గమధ్యలో కల్వకుర్తి మండలం కొట్ర గేటు సమీపంలో అక్రమంగా అరెస్టు చేసి ఊరుకొండ పోలీస్ స్టేషన్ కు తరలించి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం సరికాదని ఓబీసీ జిల్లా అధ్యక్షులు వాగుల్ దాస్ నిరంజన్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యమాలను అణచివేసేందుకు ప్రయత్నించిన ప్రభుత్వాలకు పుట్టగతులు ఉండవని తేల్చి చెప్పారు. న్యాయబద్ధంగా ప్రశ్నించడం.. ఉద్యమించడం.. ప్రతి నాయకుడి హక్కు అని.. హక్కులను కాల రాసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తే ప్రజలు, ముదిరాజుల సంఘాలు సరైన సమయంలో తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. ఉద్యమాలను అణచివేసేందుకు ప్రయత్నిస్తే ప్రతి ప్రభుత్వ కార్యాలయాల ముందు, ప్రజా ప్రతినిధుల క్యాంపు కార్యాలయాల ముందు ధర్నాలు చేపట్టి ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.



