– మేం అనుమతుల కోసం వెళ్తే…గుజరాత్ రమ్మంటున్నారు
– చిత్తశుద్ధి ఉంటే యూపీలో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయండి
– పెట్టుబడుల్ని బలవంతంగా గుంజుకుంటున్నారు
– ఉత్తరాది, దక్షిణాది అంతరాలు పెంచొద్దు
– త్వరలో చైనాకు వెళ్లి నేర్చుకుంటా..
– జులై నాటికి 20ఏండ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి :
దిహిందూ హడ్లీ-2026లో సీఎం రేవంత్రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
‘‘మేం పన్నులు కట్టి ఢిల్లీకి సలాం కొట్టాలా? పనిచేసే రాష్ర్టాలను శిక్షించొద్దు. దక్షిణాది రాష్ట్రాలు కేంద్రానికి ఎక్కువ ఆదాయం ఇస్తూ, తక్కువ తీసుకుంటున్నాయి. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోం శాఖ మంత్రి అంతా ఉత్తరాది రాష్ట్రాలవారే. ప్రజల్లో ప్రాంతాల మధ్య ఇలాంటి అంతరాలు పెంచొద్దు. బీజేపీ ప్రతిపాదించినట్టు పార్లమెంటులో సీట్ల సంఖ్యను పెంచితే ఈ అంతరాలు మరింత పెరుగుతాయి. కేరళలో లోక్సభ సీట్లు 20 నుంచి 30కి పెరిగితే ఉత్తరప్రదేశ్లో 80 నుంచి120 పెరుగుతాయి.. ఇది సరైంది కాదు. దీన్నే మేం వ్యతిరేకిస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహిళా రిజర్వేషన్ల పేరుతో రాజకీయ జిమ్మిక్కులు చేస్తున్నారు. పార్లమెంట్ సీట్ల పెంపును మహిళా రిజర్వేషన్ బిల్లుతో ముడిపెట్టడాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. నిజంగానే కేంద్రానికి మహిళా రిజర్వేషన్ల అమలుపై చిత్తశుద్ధి ఉంటే 2027లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు వస్తున్నాయి. అక్కడ ఆ బిల్లును అమలు చేయాలి’’ అని సీఎం ఏ రేవంత్రెడ్డి కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఫైర్ అయ్యారు. బీజేపీ విధానాలు, ప్రధాని మోడీ వైఖరి సరైనవి కావని స్పష్టం చేశారు. శనివారం బెంగుళూరులో ది హిందూ ఆంగ్ల దినపత్రిక నిర్వహించిన ‘హడ్లీ-2026’ లో ఆ గ్రూప్ డైరెక్టర్ ఎన్ రామ్ అడిగిన అనేక ప్రశ్నలకు సీఎం రేవంత్రెడ్డి సమాధానాలు చెప్పారు. రాష్ట్ర విభజన, స్థానిక కారణాలతోనే తాను తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యత్వానికి, ఆపార్టీకి రాజీనామా చేసి, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్పార్టీలో చేరానని తెలిపారు. తన రాజకీయ ప్రస్థానం విషయాలన్నీ రాహుల్ గాంధీకి తెలియజేశానని వివరించారు. గతంలో రాష్ట్రాన్ని పాలించే అవకాశం వచ్చిన వారు పాలకులుగా భావించారనీ, తాను సేవ చేయడానికి వచ్చిన ప్రజా ప్రతినిధిగా భావిస్తానని చెప్పారు. తెలంగాణలో ప్రభుత్వరంగంలో 2 లక్షలు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయనీ, మాజీ సీఎం కేసీఆర్ ఆ సమస్యను పరిష్కరించలేదని విమర్శించారు. ఓ ఆర్ఎంపీ డాక్టర్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా నియమించారనీ, ఆయన గ్రూప్-1 అభ్యర్థులన ఇంటర్వ్యూ చేస్తాడంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముందన్నారు. అందుకే తాను యూపీఎస్సీ పనిని అధ్యయనం చేసి, దాన్ని టీజీపీఎస్సీలో అమలు చేస్తున్నామన్నారు. గతంలో మహారాష్ట్ర తర్వాత తెలంగాణలోనే ఎక్కువ సంఖ్యలో రైతు ఆత్మహత్యలు జరిగేవనీ, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 25,035 రైతు కుటుంబాలకు చెందిన రూ.20,616 కోట్ల రుణాలను మాఫీ చేశామనీ, ఫలితంగా 2024-25 సంవత్సరంలో రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను ఎన్సీఆర్బీ గుర్తించిందని చెప్పారు. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించి, పంట ఉత్పత్తుల సేకరణను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ర్టంలో మహిళా సాధికారిత కోసం చేస్తున్న కృషిని వివరించారు. తెలంగాణ రైజింగ్-2024, మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ, క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ),ప్యూర్ (పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ), రేర్ (రూరల్ అగ్రికల్చరల్ రీజియన్ ఎకానమీ)ల గురించి తెలిపారు. కుల వ్యవస్థ నిర్మూలన కోసమే యంగ్ ఇండియా స్కూళ్లు ఏర్పాటు చేశామన్నారు. వైట్ కాలర్ జాబ్లకు ప్రత్యామ్నాయం బ్లూ కాలర్ జాబ్స్ అనీ, యువతరం ప్రత్యామ్నాయంపై దృష్టిపెట్టి, నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. గుజరాత్ పెట్టుబడులను ఆకర్షించడం లేదనీ, అక్కడ .బలవంతంగా పెట్టుబడులు పెట్టేలా చేస్తున్నారనీ, గడచిన 20 ఏండ్లుగా ఇక్కడ ఒకే బ్రాండ్ అంబాసిడర్ పని చేస్తున్నారని తెలిపారు. పారిశ్రామిక పెట్టుబడుల ఆహ్వానంలో తమకు ప్రపంచ దేశాలతోనే పోటీ అని స్పష్టంచేశారు. త్వరలోనే తాను చైనా సందర్శించి, అక్కడి ఉత్తమ పద్ధతుల గురించి నేర్చుకుంటానని చెప్పారు. పరిపాలనలో కామన్ సెన్స్ అతి ముఖ్యమైన అంశమని స్పష్టం చేశారు. తాను ప్రతి పది రోజులకు ప్రెస్మీట్ నిర్వహిస్తాననీ, విలేకరులు అడిగే ప్రతి ప్రశ్నకు జవాబిస్తానన్నారు. ప్రధానంగా కేసీఆర్ మీడియా పర్సన్స్ను తాను అనుమతిస్తాననీ, ప్రజలతో అనుసంధానమైతేనే ఏదైనా అర్ధమవుతుందని తెలిపారు. వ్యతిరేక వార్తలపై మాట్లాడుతూ తాను వాటిని పట్టించుకోనన్నారు. దూషించను. వ్యంగంగా మాట్లాడతా. జర్నలిస్టులతో వాదించను. వాళ్లు వ్యతిరేకంగా రాసినా పట్టించుకోను. అందులో విషయం ఉంటే అధికారులతో మాట్లాడతా. మీడియా ను బ్యాక్ ఆఫీస్ సమాచారంగా చూస్తానని స్పష్టత ఇచ్చారు. హైడ్రా, ఈగల్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, ఇంటి గ్రేటెడ్ స్కూళ్లు, కులగణన తదితర అంశాలను ప్రస్తావించారు. ప్రభుత్వ విద్యకు తొలి ప్రాధాన్యత ఇస్తానన్నారు. గత ప్రభుత్వం 11 నుంచి 11.50 శాతం వడ్డీ రేటుతో స్వల్ప కాలానికి అప్పులు తెచ్చిందనీ, తాముఇ ఇప్పుడు వాటిని 7 నుంచి 8 శాతం వడ్డీరేటుతో పునర్వ్యవస్థీకరిస్తూ దీర్ఘకాల రుణాలుగా మార్చుతున్నామన్నారు. ప్రతిపక్షంగా కేంద్ర ప్రభుత్వ వివక్షపై పోరాడతానన్నారు. హైడ్రా మోడల్ అందరికీ అవసరం అని అభ్రిపాయపడ్డారు. పెట్టుబడుల సాధన విషయంలో పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వక మ్యాచ్ ఆడతామన్నారు.ఆనంతరం ఆయన బెంగళూరు నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని కోహెడ ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్,ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ ఆఫీస్ కాంప్లెక్స్ కు శంకుస్థాపన కార్యక్రమాలకు వెళ్లారు.
మేం పన్నులు కట్టి ఢిల్లీకి సలాం కొట్టాలా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



