ప్రకృతి దేవుడు ఇచ్చిన వరం..

– రాష్ట్రంలో ఒకేరోజు కోటి వృక్షార్చన:స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ నసురుల్లాబాద్ (బాన్సువాడ)
ప్రకృతి దేవుడు మనకు అందించిన గొప్ప వరం.. సహజవనరులే మన సంపద అన్నారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం
కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మొక్కలను రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ పోచారం మాట్లాడుతూ ప్రకృతి.. దేవుడు మనకు అందించిన గొప్పవరం. సహజవనరులే మన సంపద. మొక్కలు పెంచి కాలుష్యాన్ని నియంత్రిస్తూ, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తూ.. పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడుకోవాలి. భావితరాలకు పచ్చని భూమిని పదిలంగా అందించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనం పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం 2016లో తెలంగాణ కు హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. 230 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యం అయితే దానిని అధిగమించి ఇప్పటి వరకు 270 కోట్ల మొక్కలు నాటడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఒక్కరోజు కోటి మొక్కలు నాటే కోటి వృక్షార్చన కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రకృతిని కాపాడితే అది మనలను కాపాడుతుందన్నారు. చెట్లను నరికి, ప్రకృతిని నాశనం చేస్తే విలయాలు సంభవిస్తాయని అన్నారు. భారతదేశంలో ప్రతి మనిషికి సగటున కేవలం మూడు చెట్లు మాత్రమే ఉన్నాయని.
వాతావరణం సమతుల్యత బాగా ఉండాలంటే భూ విస్తీర్ణంలో 33 శాతం అడవులు ఉండాలన్నారు. 2014 లో తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు అడవుల విస్తీర్ణం 26 శాతం ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం కృషి, హరితహారం కార్యక్రమంతో ఇప్పుడు 33 శాతానికి పెరిగిందన్నారు. చెట్లు ఉంటే వర్షాలు పడతాయని.  చెట్లను నాటడం, సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఆర్డీఓ భుజంగరావు, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు డి. అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ నెర్రె నర్సింహులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు, కళాశాల విద్యార్థులు తదితరులు హాజరయ్యారు.
Spread the love