కేజ్రీవాల్‌తో నీతీశ్‌ భేటీ…

నవతెలంగాన – ఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి బీజేపీకు వ్యతిరేకంగా విపక్షాల ఐక్యతపై ఆయా పార్టీల నేతల మధ్య సమాలోచనలు సాగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నీతీశ్‌కుమార్‌ ఆదివారం ఢిల్లీ సీఎం, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు. బిహార్‌ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌తో కలిసి ఢిల్లీకి వెళ్లిన నీతీశ్‌.. కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్‌లా ఓ ‘రాజ్యసభ ప్లాన్‌’ను నీతీశ్‌ వద్ద ప్రతిపాదించినట్లు సమాచారం.  పాలనావ్యవహారాల విషయంలో ఆప్ ప్రభుత్వానికి అనుకూలంగా ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును తప్పించేందుకు కేంద్రం ఆర్డినెన్స్‌ను తీసుకురావడం ‘రాజ్యాంగ విరుద్ధం’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ విషయంలో నితీశ్‌ కుమార్ తనకు పూర్తి మద్దతు ప్రకటించారని, తాము కలిసి పోరాడతామని చెప్పారు. ‘ఢిల్లీకి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయంపై అందరం కలిసి పోరాడతాం. బీజేపీయేతర ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వస్తే.. రాజ్యసభలో బిల్లు రూపంలోని ఆర్డినెన్స్‌ను ఓడించవచ్చని సూచించా. ఇదే జరిగితే.. ఎన్నికలకు ముందు సెమీఫైనల్‌లా అవుతుంది. 2024లో బీజేపీ తిరిగి అధికారంలోకి రాదనే సందేశం దేశమంతటా వెళ్తుంది’ అని కేజ్రీవాల్‌ అన్నారు. ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వం నుంచి అధికారాన్ని ఎలా లాక్కుంటారని నీతీశ్‌ కుమార్ సైతం ప్రశ్నించారు. ‘సుప్రీం కోర్టు ఢిల్లీ ప్రభుత్వానికి పని చేసే హక్కు ఇచ్చింది. దాన్ని ఎలా లాక్కోగలరు? ఇది ఆశ్చర్యంగా ఉంది. ఈ విషయంలో మేం ‘ఆప్‌’తో ఉన్నాం. మరిన్ని సమావేశాలు నిర్వహిస్తాం. వీలైనన్ని ఎక్కువ ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. దీనికి సంబంధించి దేశవ్యాప్త ప్రచారాన్ని నిర్వహిస్తాం’ అని నీతీశ్‌ అన్నారు. ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే ప్రయత్నం జరుగుతోందని, ఇది తగదని వ్యాఖ్యానించారు. ఢిల్లీ విషయంలో కేంద్రం తీసుకుంటున్న చర్యలు.. ప్రజాస్వామ్యానికి ప్రమాదమని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు.

Spread the love