పంజాబ్‌, హర్యానాల్లో బీజేపీకి నో ఎంట్రీ!

పంజాబ్‌, హర్యానాల్లో బీజేపీకి నో ఎంట్రీ!లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీని పంజాబ్‌, హర్యానాలో రైతులు గట్టిదెబ్బ కొట్టే సూచనలు కనపడు తున్నాయి. ముఖ్యంగా నూతన సాగు చుట్టాల ఎపిసోడ్‌ నుంచి కమలం పార్టీ రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. మోడీ సర్కార్‌ హామీలతో ఏడాది పాటు సాగిన రైతాంగ ఉద్యమాన్ని నడిపిన అన్నదాతలు ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చడంలో కేంద్రం మోసం చేసింది. డిమాండ్ల సాధనకు చేపట్టిన ఢిల్లీ చలో ఉద్యమానికి అడ్డంకులు సృష్టించింది. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి తగిన విధంగా బుద్ధి చెబుతామని పంజాబ్‌, హర్యానా రైతులు హెచ్చరిక చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థులను ఓడించాలని, రైతు సంఘాల నేతలు ప్రజలకు పిలుపునిచ్చారు. వారు ఎన్నికల ప్రచారానికి వచ్చిన సమయంలో నల్లజెండాలతో నిరసన తెలుపుతున్నారు. రైతు సమస్యలపై రామబాణాల్లాంటి ప్రశ్నలను సంధిస్తున్నారు. మినిమం సపోర్ట్‌ ప్రైజ్‌ (ఎంఎస్పీ)కి చట్టబద్ధత,రైతు రుణాలమాఫీ వంటి అంశాలే కీలకంగా నినదిస్తున్నారు. ఇప్పటికే పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లోని పలు గ్రామాల్లోకి బీజేపీ నేతల ప్రవేశాన్ని నిషేధం విధించి వారి రాకను అడ్డుకుంటున్నారు. ”రైతులను ఢిల్లీలోకి రానివ్వలేదు. అలాంటప్పుడు మా గ్రామాల్లోకి బీజేపీ నేతలు ఎలా ప్రవేశిస్తారు? అని ప్రశ్నిస్తూ, వారి రాకపై నిషేధాన్ని విధిస్తున్నాం” అని రైతులు పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఇటీవల ”ఢిల్లీ చలో ఆందోళన కార్యక్రమం”లో పంజాబ్‌ సరిహద్దుల్లో మరణించిన యువ రైతు శుభకరణ్‌కు నివాళిగా అనేక గ్రామాల్లో బ్యానర్లు ఏర్పాటు చేశారు. ”నేను చేసిన తప్పేమిటి? మీ (కేంద్ర ప్రభుత్వం) హామీలను గుర్తు చేయడానికి ఢిల్లీ రావాలనుకుంటున్నాను” అని అందులో రాసి ఉంది. రైతు ఉద్యమంలో బుల్లెట్లు, టీయర్‌ గ్యాస్‌ ప్రయోగించడం పట్ల తీవ్ర అసహనంగా ఉన్నారు. ఇప్పటికీ లంకింపూర్‌ఖేరీ బాధితులకు న్యాయం చేయలేదని, అజరు మిశ్రాను కేంద్ర క్యాబినెట్లో ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. రైతులపై పెట్టిన కేసులను ఎందుకు ఉపసంహరించు కోలేదని, కార్పొరేట్లకు అప్పులను మాఫీ చేస్తున్న మీరు రైతు రుణాలను ఎందుకు మాఫీ చేయడం లేదని అడుగు తున్నారు. అమలు చేయబోమని హామీ ఇచ్చిన విద్యుత్‌ సవరణ చట్టాన్ని పార్లమెంట్‌లో ఎందుకు ప్రవేశపెట్టారని బహిరంగంగానే ప్రశ్నలు సంధిస్తున్నారు. ‘కాలుష్య చట్టం’ పరిధి నుంచి వ్యవసాయాన్ని ఎందుకు మినహాయించలేదని, భాఖ్రా, పాంగ్‌ డ్యాములను పంజాబ్‌ నుంచి ఎందుకు లాక్కున్నారని ప్రచారంలో వారు నిలదీస్తున్నారు. ఇలాంటి ప్రశ్నలను పంజాబ్‌, హర్యానా రైతులు బీజేపీపైకి ఎక్కుపెట్టారు. భారత దేశ రైతులు, రైతు సంఘాలు, ప్రజాస్వామిక వాదులు కూడా న్యాయమైన రైతు సమస్యలను పరిష్కరించి, రైతు ప్రశ్నలకు మోడీ జవాబు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు.
– డాక్టర్‌. కోలాహలం రామ్‌ కిశోర్‌.
9849328496.

Spread the love