నవతెలంగాణ – భిక్కనూర్
ప్రజల సమస్యలు పరిష్కరించడంలో గ్రామపంచాయతీ అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా బుధవారం బిక్నూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రామసభలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థుల సమస్యలు, అభివృద్ధి అవసరాలు, సంక్షేమ పథకాల అమలు తీరును గ్రామస్థులతో కలిసి సమీక్షించారు. గ్రామ ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులు వాటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ నెల 4, 6, 8, 10 తేదీలలో నాలుగు దఫాలుగా నిర్వహిస్తున్న ప్రత్యేక గ్రామసభల ద్వారా గ్రామాభివృద్ధికి సంబంధించిన పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.
గ్రామంలో ఉన్న పూరి గుడిసెలను గుర్తించి అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలో 10 పూరి గుడిసెలను గుర్తించినట్లు తెలిపారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే నిర్వహిస్తూ, 18 సంవత్సరాలు నిండిన అర్హులైన వారిని ఓటరు జాబితాలో నమోదు చేయడం, డబుల్ ఓటర్ల పేర్లను తొలగించడం జరుగుతోందని పేర్కొన్నారు.జన సంరక్షణ – మన సంరక్షణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 36 వేల కందకాలను తవ్వడం జరిగిందని తెలిపారు. గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా, రైతులకు ఆయిల్ పామ్ సాగుపై విస్తృత అవగాహన కల్పించి, పంట విస్తీర్ణాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి అర్హులైన లబ్ధిదారులకు చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. గ్రామాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొంటూ, గ్రామసభల ద్వారా ప్రజల సమస్యలకు వేగవంతమైన పరిష్కారం లభిస్తుందని తెలిపారు. “అరైవ్ అలైవ్” కార్యక్రమాన్ని నిర్వహించి, రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్మికులు, సిబ్బందికి కే జే యల్ సహకారంతో అందించిన హెల్మెట్లను ద్విచక్ర వాహనదారులకు పంపిణీ చేశారు. ప్రతి ప్రయాణంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. రోడ్డు భద్రతా నిబంధనలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించి ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నర్సింహా రెడ్డి, అదనపు కలెక్టట్ ఎంవి గిరి, గ్రామ సర్పంచ్ బల్యాల రేఖ సుదర్శన్, ఉప సర్పంచ్ మోహన్ రెడ్డి, సంబంధిత జిల్లా అధికారులు, ఎమ్మార్వో సునీత, ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మహేష్ గౌడ్, మండల స్థాయి అధికారులు, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.



