– కుల, మతరహిత కాలమ్ను పెట్టాలి
– హైకోర్టు చారిత్రాత్మక తీర్పు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర హైకోర్టు బుధవారం చారిత్రాత్మక తీర్పునిచ్చింది. హైదరాబాద్కు చెందిన సందేపాగు రూప, డేవిడ్ దంపతులు తమ కుమారుడు ఇవాన్ రూడేకి పుట్టుకతో కులరహిత, మతరహిత సర్టిఫికేట్ను ఇవ్వాలంటూతెలంగాణ హైకోర్టులో 2019 ఆగస్టు 28న నమోదు చేసిన రిట్ పిటిషన్పై బుధవారం జస్టిస్ లలిత కన్నెగంటి కీలకమైన తీర్పును వెలువరించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం ఒక వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని విశ్వసించే స్వేచ్ఛ ఉన్నట్టుగానే తమకు నమ్మకం లేని మతాన్ని విశ్వసించని హక్కు కూడా ఉంటుంది. ఇది భావప్రకటన స్వేచ్ఛలో భాగం కాబట్టి పిటిషనర్లు కోరినట్టుగా ‘బర్త్ సర్టిఫికేట్’లో కుల రహిత, మత రహిత’ కాలాన్ని పొందపరచాలని, దీని కోసం చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.
వివరాల్లోకి వెళితే 2019, మార్చి 23న జన్మించిన తమ కొడుకు ‘ఇవాన్ రూడే’ బర్త్ సర్టిఫికెట్ కోసం దంపతులు వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీకి వెళ్లారు (బాబు జన్మించిన ప్రాంతం). జనన నమోదు ఫారంలోని కుటుంబ ‘మతం’ అనే కాలమ్ నింపితే తప్ప బర్త్ సర్టిఫికెట్ ఇవ్వడం కుదరదని సదరు అధికారులు చెప్పారు. దీంతో కులాంతర, మతాంతర వివాహం చేసుకున్న ఆ దంపతులు… మతాన్ని, కులాన్ని విశ్వసించడం లేదు… కాబట్టి అందులో ఉన్న ‘కుటుంబ మతం’ అనే కాలమ్ నింపడానికి నిరాకరించారు. ఆ కాలమ్ నింపితే తప్ప బర్త్ సర్టిఫికెట్ ఇవ్వడం కుదరని మున్సిపాల్టీ అధికారులు చెప్పడంతో జిల్లా కలెక్టర్తో పాటు ఉన్నతాధికారులను ఆశ్రయించారు. అప్పటికీ తాము కోరిన పద్ధతుల్లో బర్త్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో హైకోర్టులో పిల్ను దాఖలు (2019, ఆగస్టు 28న) చేశారు. గతంలో ఈకేసులో విచారించిన జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం వారి డిమాండ్ పై కౌంటర్ దాఖలు చేయమని కోరుతూ జనన, మరణ ధృరువీకరణ అధికారులకు (రిజిస్ట్రర్ ఆఫ్ సైన్సెస్), రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శికి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శికి, కొత్తకోట మున్సిపాల్టీ అధికారులకు నోటీసులను జారీ చేసింది. తదుపరి విచారణరు నాలుగు వారాల గడువు విధించింది. అయితే సంవత్సరాలు గడుస్తున్నా… ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయకపోగా, మరింత సమయాన్ని కోరుతూ వాయిదా వేస్తూ వచ్చారు.
ఐదేండ్లలోపు బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలంటూ ప్రభుత్వ నియమాలు ఉన్న నేపథ్యంలో, బర్త్ సర్టిఫికేట్ లేని కారణంగా ఆధార్ కార్టు ఇవ్వకపోవడం, స్కూల్లో చేర్చుకోవడానికి విద్యాసంస్థలు నిరాకరించడంతో అత్యవసరంగా తీర్పు ఇవ్వాలని పిటిషనర్ల తరపున న్యాయవాదులు ఎస్. వెంకన్న, డి. సురేష్ కుమార్లు కోర్టును కోరడంతో తీర్పు వెలువరించింది.
తీర్పుపట్ల దంపతులు హర్షం….
తాము కోరినట్టుగా జస్టిస్ లలిత కన్నెగంటి తీర్పు ఇవ్వడం పట్ల డేవిడ్, రూప దంపతులు హర్షం వ్యక్తం చేశారు. మూడేండ్ల తమ పోరాటం ఫలించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. చారిత్రాత్మకమైన ఈ తీర్పు ఎంతో మందికి దారి చూపుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ దేశంలో కుల,మతాలకు అతీతంగా జీవిస్తున్న వారు ఎందరో ఉన్నారని, వీటికి వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాట చరిత్ర కూడా ఉందని తెలిపారు. మతాన్ని, కులాన్ని వదులుకునేందుకు ఎవరైనా ముందుకు వస్తే వ్యక్తిగత స్థాయిల్లో ఏదో సర్దుబాటు చేస్తూ పరిష్కారం చూపుతున్నారే తప్ప… చట్టం చేయడానికి మాత్రం ప్రభుత్వం వెనుకడుగు వేస్తున్న తరుణంలో శాశ్వత పరిష్కారాన్ని చూపుతూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనదని హర్షం వ్యక్తం చేశారు.
తమిళనాడుకు చెందిన న్యాయవాది ‘ఎం.స్నేహ’ తనకు ఇచ్చే సర్టిఫికెట్ లో నో క్యాస్ట్, నో రిలీజన్ అనే అప్షన్ ఉండాలని పోరాడితే ఎట్టకేలకు స్థానిక కలెక్టర్ ఆమెకు సర్టిఫికెట్ అందజేశారు కానీ ఆన్లైన్లో ఏదైనా దరఖాస్తు చేసుకోవాలన్నా మళ్ళీ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తోంది. అలాగే హైదరాబాద్కు చెందిన డి.వి.రామకృష్ణ రావు, ఎస్. క్లారెన్స్ కృపాళిని దంపతులు కూడా ఇదే డిమాండ్ పై కోర్టును ఆశ్రయించారు. తమ పిల్లల అడ్మిషన్ సందర్భంగా మతం అనే కాలమ్ నింపితే తప్ప అడ్మిషన్ ఇవ్వమని స్కూల్ యాజమాన్యం చెప్పడంతో వాళ్ళు కోర్టును ఆశ్రయించారు.
మతం చెప్పడానికి నిరాకరించిన కారణంగా అడ్మిషన్ ఇవ్వకపోవడం సరైనది కాదని కోర్టు చివాట్లు పెట్టడంతో స్కూల్ యాజమాన్యం ఎట్టకేలకు అడ్మిషన్ ఇచ్చింది. కానీ ఆన్ లైన్ వ్యవహారాల్లో మతం, కులం అనే కాలం ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది…. కాబట్టి శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు కావాలంటూ కోర్టు ఆదేశించాలని రూపా, డేవిడ్ దంపతులు కోరారు. మతాన్ని నమ్మే హక్కు ఎలాగైతే ఉందో, వాటిని నమ్మకుండా ఉండే హక్కు కూడా రాజ్యాంగమే కల్పించింది కాబట్టి తమ లాంటి వారి డిమాండ్ను పరిగణలోకి తీసుకుని జస్టిస్ లలిత కన్నెగంటి ఇచ్చిన తీర్పు న్యాయం చేస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.