ఉద్యోగులకు పెండింగ్‌ జీతాలు వెంటనే చెల్లించాలి: హరీశ్‌ రావు

నవతెలంగాణ – హైదరాబాద్: నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ హెచ్ ఎం) ‌పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం బాధాకరం అంటూ హరీష్‌ రావు ట్వీట్‌ చేశారు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, తెలంగాణ డయాగ్నోస్టిక్స్ తదితర 78 విభాగాలలో పనిచేస్తున్న 17,541 మంది జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహించారు. ప్రజల ఆరోగ్యాలను సంరక్షించేందుకు నిరంతరం కృషి చేసే వైద్య సిబ్బందికి నెలలుగా జీతాలు చెల్లించకపోవడం ప్రజారోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి ఇది అద్దం పడుతున్నదన్నారు. ప్రతి నెల 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు ఒట్టి డొల్ల అని చెప్పడానికి ఇది మరో నిదర్శనమని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి 3 నెలల పెండింగ్ జీతంతో పాటు, పీఆర్సీ బకాయిలను తక్షణమే చెల్లించాలని ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని పేర్కొన్నారు.

Spread the love