– ఫార్మసిస్టుల ధర్నా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రార్, జూనియర్ క్లర్క్పై చర్యలు తీసుకోవాలని పలువురు ఫార్మసిస్టులు డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించిన ధర్నాలో తెలంగాణ ఫార్మా సొసైటీ అధ్యక్షులు ఆకుల సంజరు రెడ్డితో పాటు తేజ, శివకుమార్, కొలిపాక బాలరాజు, మాడెం ప్రభాకర్, కన్నెబోయిన శ్రీనివాస్, కంభంపాటి శ్రీకాంత్, ఏం.సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయనీ, ఫార్మసిస్టుల సంతకాలు వెరిఫై చేయాలని కోరారు. కౌన్సిల్ 29,594 ఓట్లు మాత్రమే చూపిస్తున్నదనీ, మిగతా 23,406 ఓట్లు ఎటు పోయాయని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో కౌన్సిల్ నుంచి కోటి రూపాయలు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. 20 వేల పోస్టల్ బ్యాలెట్ లో 6,500 తిరస్కరించడానికి గల కారణాలు ఏమిటి.? అని ప్రశ్నించారు. రిజిస్ట్రార్ యోగానందం, జూనియర్ క్లర్క్ గోపి, కార్యాలయ సిబ్బంది అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ కమీషన్ వేయాలని కోరారు.