– 92,808 మంది దరఖాస్తు
– 259 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో పాలిటెక్నిక్, డిప్లొమా, వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్-2024 రాతపరీక్ష శుక్రవారం జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణా మండలి (ఎస్బీటీఈటీ) కార్యదర్శి, పాలిసెట్ కన్వీనర్ పుల్లయ్య బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఈ పరీక్షను రాష్ట్రంలోని 259 పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తామని తెలిపారు. పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. ఎంపీసీ నుంచి 56,764 మంది, బైపీసీ నుంచి 36,044 మంది కలిపి 92,808 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని వివరించారు. విద్యార్థులను గంట ముందునుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని తెలిపారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టం చేశారు. హాల్టికెట్తోపా4టు హెచ్బీ పెన్సిల్, ఎరేసర్, బ్లూ, బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను తప్పక తీసుకుని రావాలని సూచించారు. హాల్టికెట్ మీద ఫొటో ముద్రించని వారు పాస్పోర్టు సైజ్ ఫొటోతోపాటు ఆధార్ కార్డు (గుర్తింపు కార్డు) వెంటను తెచ్చుకోవాలని కోరారు. పరీక్షా కేంద్రంలోకి సెల్ఫోన్ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించబోమని పేర్కొన్నారు.