ఈసీ నుంచి పాస్‌ పొందిన జర్నలిస్టులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణతోసహా త్వరలో నాలుగు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా జర్నలిస్టులు, 12 ఇతర విభాగాలకు చెందిన ఉద్యోగులకు ఈసీ పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించింది. ఎఫ్‌సీఐ, ఏఏఐ, పీఐబీ, ఎయిర్‌, విద్యుత్‌ శాఖ, రైల్వే, వైద్యరోగ్య శాఖ, ఆర్టీసీ, పౌరసరాఫరాల శాఖ, బీఎస్‌ఎన్‌ఎల్‌, వార్తల సేకరణ కోసం ఈసీ నుంచి పాస్‌ పొందిన జర్నలిస్టులు, ఫైర్‌ సిబ్బందికి కొత్తగా పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించారు. వీరంతా నవంబర్‌ ఏడవ తేదీలోగా ఫారం-12 డీ రూపంలో దరఖాస్తు చేయాలి. కాగా, కొత్త ఓటర్లకు నెలాఖరు నుంచి ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ జరగనుంది. ఈఏడాది రెండు విడతలుగా ఓటర్ల జాబితా ప్రకటించారు. 2023 జనవరి నుంచి కొత్తగా 40 లక్షల దరఖాస్తులను అధికారులు పరిష్కరించారు. జనవరి ఒకటి నుంచి 27 లక్షల 50వేలకు పైగా ఓటరు గుర్తింపు కార్డులను ముద్రించి తపాలా శాఖ ద్వారా ఓటర్ల చిరునామాలకే పంపించారు. ఆ తర్వాత కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారికి సంబంధించిన గుర్తింపు కార్డుల ముద్రణ కోసం ఇప్పటికే ఆర్డర్‌ చర్యలు తీసుకున్నారు. మిగిలిన వారి కార్డుల ముద్రణ పూర్తి చేసి పంపిణీ చేయనున్నారు.

Spread the love