– నాసిరకమైన పనులు, ముక్కలైన చెక్ డ్యామ్లు
– భారీ వర్షాలతో బయటపడిన డొల్లతనం
నవతెలంగాణ-మల్హర్రావు
వరద పోటెత్తితే వర్షాల నీటిని ఒడిసిపట్టే ఆనకట్టలు ఎక్కడికక్కడ ధ్వంసమై వరదల్లో ముక్కలుముక్కలై కొట్టుకుపోతున్నాయి. భారీ వర్షాల ప్రభావంతో వాగులు, ఎల్ఎండీ గేట్ల ఎత్తివేతతో నీటి ప్రవాహం పెరిగి మానేరుపై కోట్ల రూపాయలతో నిర్మించిన చెక్డ్యామ్లు ధ్వంసమయ్యాయి. గుత్తేదారులు నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో నాణ్యత నవ్వుల పాలై కోట్ల రూపాయల ప్రజల సొమ్ము నీళ్ల పాలవుతోంది. ఇందుకు జయశంకర్-భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల సరిహద్దుల్లో మానేరుపై నిర్మించిన చెక్డ్యామ్లే ఉదాహరణ. వరద తాకిడికి ఇప్పటికే రెండు సార్లు ముక్కలయ్యాయి.
జయశంకర్-భూపాలపల్లి జిల్లా మల్హర్రావు మండలంలోని మల్లారం మానేరు నదిపై మొదటిసారి రూ.8 కోట్ల పైనే ఖర్చు చేసి చెక్డ్యామ్ నిర్మాణం చేపట్టారు. తేలికపాటి వరదల్లో చెక్ డ్యామ్తోపాటు పక్కనున్న పొలాలు సైతం కోతకు గురయ్యాయి. రెండవసారి రూ.16.62కోట్లతో నిర్మాణ పనులు చేపట్టారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వరదలకు మళ్ళీ చెక్ డ్యామ్ నాలుగు ముక్కలైన పరిస్థితి. అలాగే తాడిచెర్ల ఖమ్మంపల్లి మానేరుపై రూ.14.31కోట్లతో, సోమన్పల్లి, పీవీ నగర్ మానేరుపై రూ.13.40కోట్లతో చెక్డ్యామ్ నిర్మాణ పనులు చేపట్టారు. భారీ వర్షాలతో ఈ చెక్ డ్యామ్లు ముక్కలు ముక్కలయ్యాయి. అయితే చెక్ డ్యామ్లు తరచు వరదల్లో కొట్టుకుపోవడం పరిపాటిగా మారింది. చెక్ డ్యామ్ నిర్మాణ పనులపై సంబంధిత ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో గుత్తేదారులు పనుల్లో నాణ్యత పాటించడం లేదని, అందుకే తరచూ వరదల్లో కొట్టుకుపోతున్నాయని పలువురు తెలిపారు. మానేరుపై 500 మీటర్ల పొడవుతో చెక్డ్యామ్ నిర్మాణ పనుల్లో సైడ్ వాల్స్ అడుగు భాగంలో గుత్తేదార్లు బైండింగ్ మట్టి పోయకపోవడం, ఇరు వైపులా కరకట్టలు కట్టకపోవడంతో పొలాలు కోతకు గురయ్యాయని రైతులు వాపోతున్నారు.
శాశ్వత పరిష్కారమేదీ..?
ఆయుకట్టల నిర్మాణంలో భాగంగా ముందుగా వాగులో గట్టితనం వచ్చేవరకు ఇసుకను పూర్తిగా తోడి బెడ్ నిర్మించాల్సి ఉంటుంది. ఇందుకు భిన్నంగా ఇసుకపై పునాది వేయడంతో చెక్ డ్యామ్ కింద నీటిని ఎత్తిపోసేందుకు నిర్మించిన అప్రాన్లు రిటైనింగ్ వాల్స్, అబార్ట్మెంట్ భాగాలు వరద ఉధృతికి దెబ్బతింటున్నాయి. వరద ఉధృతిని అంచనా వేసేందుకు ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోయింది. ఇసుక మేటలు పూర్తిగా తొలగించకుండానే చెక్ డ్యామ్ నిర్మాణం చేపట్టడంతో దెబ్బతింటున్నాయని పరివాహక ప్రాంత రైతులు చెబుతున్నారు. అధికారులు మాత్రం క్షేత్రస్థాయిలో పరిశీలించి వెళుతున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదని ఆరోపిస్తున్నారు.