జగిత్యాలలో దోశలు వేసిన రాహుల్‌ గాంధీ

నవతెలంగాణ – జగిత్యాల: అసెంబ్లీ ఎన్నికల వేళ.. గత రెండు రోజులుగా కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. శుక్రవారం ఉదయం జగిత్యాలలో కరీంనగర్‌-పార్క్‌ నుంచి మూడో రోజు కాంగ్రెస్‌ విజయ భేరి యాత్ర ప్రారంభమైంది. జగిత్యాల కార్నర్‌ సదస్సులో పాల్గొనడానికి బయలుదేరిన రాహుల్‌ గాంధీ జగిత్యాల మార్గమధ్యలో నూకపల్లి ఎన్‌ఎసి స్టాప్‌ వద్ద ఆగారు. అక్కడ స్కూటీపై వెళుతున్న ప్రయాణికులతో ముచ్చటించారు. చిన్నారులకు చాక్లెట్స్‌ పంచారు. ఆ తరువాత పక్కనే ఉన్న టిఫిన్‌ బండి వద్దకు వెళ్లారు. దోశ తినాలంటే ఎంత డబ్బు కట్టాలంటూ .. హాస్యమాడారు.” నువ్వు కాదు నేను కూడా దోసె వేయొచ్చా..” అని అడిగారు. దీంతో ఆ బండి యజమాని” దానికేమి భాగ్యం వేయండి సార్‌ ”అంటూ పక్కకు జరిగాడు. ” నాకు దోస వేయడం రాకపోతే నేర్పిస్తావా ” అంటూ అనడంతో కాసేపు అక్కడి వాతావరణమంతా నవ్వులతో నిండింది. రాహుల్‌ గాంధీ దోశెలను వేయడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఆ తరువాత రాహుల్‌ గాంధీ తిరిగి జగిత్యాల సదస్సుకు బయలుదేరారు.

Spread the love