రాజ్యాంగంతోనే పేదలకు బలమైన శక్తి వచ్చింది : రాహుల్ గాంధీ

నవతెలంగాణ-హైదరాబాద్ : ఈ దేశంలో రాజ్యాంగంతోనే పేదలకు బలమైన శక్తి వచ్చిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ జనజాతర సభలో ఆయన ప్రసంగించారు. ‘‘గొప్ప మేధావులు ఏళ్ల తరబడి కృషి చేసి దేశానికి రాజ్యాంగం అందించారు. ఎంతో గొప్పదైన మన రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. దేశంలో 90శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజ్యాధికారం దక్కటం లేదు. విద్య, ఉద్యోగాలు, ఓటు హక్కు అన్నీ మనకు రాజ్యాంగం ద్వారానే వచ్చాయి. దాంతో పాటు రిజర్వేషన్లు కూడా రద్దు చేయాలని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర చేస్తున్నాయి. రిజర్వేషన్లు రద్దు చేసే కుట్రలో భాగంగానే ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తున్నారు. క్రమంగా అన్నింటినీ ప్రయివేటు పరం చేసి రిజర్వేషన్లు రద్దు చేయాలనేది బీజేపీ ఆలోచన. మోడీ పదేళ్లలో విమానాశ్రయాలు, పోర్టులు, భారీ పరిశ్రమలు విక్రయించారు. బీజేపీ కుట్రలను అడ్డుకునేందుకు ఇండియా కూటమి శాయశక్తులా పోరాడుతోంది. మోడీ పాలనలో కేవలం 2శాతం ఉన్న బిలియనీర్ల చేతిలోకి దేశ సంపద అంతా వెళ్తోంది. బలహీన వర్గాల్లో రాజకీయ చైతన్యం తెచ్చేందుకు మేం కృషి చేస్తున్నాం. దేశంలో పేదరికాన్ని సమూలంగా నిర్మూలించేందుకు గొప్ప పథకాన్ని రూపొందించాం. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చాక.. నిరుపేదలందరితో ఒక జాబితా రూపొందిస్తాం. ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళ పేరును ఎంపిక చేసుకుని వారి బ్యాంకు ఖాతాలో రూ.లక్ష డిపాజిట్‌ చేస్తాం. విద్య, వైద్యం తదితర కుటుంబ ఖర్చుల కోసం వారికి ప్రతి నెలా రూ.8,500 వారి ఖాతాలో జమ అవుతాయి’’ అని రాహుల్‌ గాంధీ తెలిపారు.

Spread the love