నవతెలంగాణ-హైదరాబాద్ : తాము మహిళలకు మహాలక్ష్మి పథకం గురించి మాట్లాడిన ప్రతిసారీ ప్రధాని నరేంద్ర మోడీ చిరాకు పడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాందీ ఆరోపించారు. ఈ సొమ్ము తన బిలియనీర్ స్నేహితులకు చేరదని ఆయన అసహనానికి లోనవుతున్నారని ఆక్షేపించారు. కర్నాటకలోని శివమొగ్గలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే యువతకు అప్రంటీస్ హక్కు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాషాయ పాలకులు మీకు నిరుద్యోగాన్ని ప్రసాదిస్తే తాము అప్రెంటీస్ హక్కు కల్పించడంతో పాటు మీ బ్యాంకు ఖాతాల్లో రూ. లక్ష జమ చేస్తామని భరోసా ఇచ్చారు. అప్రంటీస్లో భాగంగా ప్రపంచశ్రేణి శిక్షణను యువతకు అందిస్తామని హామీ ఇచ్చారు.