Sunday, July 19, 2026
E-PAPER
Homeజాతీయంప్రధాని మోడీకి రాహుల్‌, ఖర్గే లేఖ..

ప్రధాని మోడీకి రాహుల్‌, ఖర్గే లేఖ..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : అయోధ్య రామమందిరం విరాళాల దుర్వినియోగం ఆరోపణలు రాజకీయంగా మరోసారి దుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని కోరుతూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంయుక్తంగా లేఖ రాశారు. భక్తులు సమర్పించిన నగదు, బంగారం, వెండి కానుకల వినియోగంపై పూర్తి వివరాలు ప్రజలకు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు.

రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌లో రూ.వేల కోట్ల విరాళాల వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు వచ్చాయని లేఖలో పేర్కొన్నారు. భక్తులు విశ్వాసంతో సమర్పించిన కానుకలపై ఇలాంటి ఆరోపణలు రావడం ఆందోళనకరమని అభిప్రాయపడ్డారు. ఈ ఘటన వల్ల లక్షలాది మంది భక్తులు మోసపోయిన భావనలో ఉన్నారని తెలిపారు.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ట్రస్ట్‌ ఏర్పాటును పార్లమెంట్‌లో ప్రధానమంత్రి ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ట్రస్ట్‌ సభ్యుల నియామకాలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరిగాయని పేర్కొన్నారు. ట్రస్ట్‌లోని పలువురు సభ్యులకు ఆర్‌ఎస్‌ఎస్‌, విశ్వహిందూ పరిషత్‌తో సంబంధాలు ఉన్నాయని లేఖలో ఆరోపించారు. మాజీ ప్రధాన కార్యదర్శి కూడా ప్రధానమంత్రికి సన్నిహితుడేనని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి మౌనం సరికాదని కాంగ్రెస్‌ నేతలు అభిప్రాయపడ్డారు. ట్రస్ట్‌ ఆర్థిక వ్యవహారాలపై పూర్తిస్థాయి స్వతంత్ర విచారణకు వెంటనే ఆదేశాలు ఇవ్వాలని కోరారు. నగదు, బంగారం, వెండి సహా భక్తులు సమర్పించిన అన్ని కానుకల లెక్కలు ప్రజల ముందుంచాలని డిమాండ్‌ చేశారు. పదవులు, పలుకుబడి చూడకుండా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.

విరాళాల లెక్కల్లో అక్రమాలు జరిగి సుమారు రూ.7 కోట్ల విలువైన నగదు, నగలు దారి మళ్లినట్లు సమాచారమొచ్చిన తర్వాత ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ట్రస్ట్‌ ఖాతాల పరిశీలనతో పాటు నగదు లెక్కింపు కేంద్రాల పనితీరును కూడా ఆ బృందం పరిశీలిస్తోంది. ఈ కేసు పురోగతిపై నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు కూడా కోరింది.

ఇప్పటివరకు ఆలయ సిబ్బంది, బ్యాంకు ఉద్యోగులు, ట్రస్ట్‌కు అనుబంధంగా పనిచేసే వ్యక్తులు కలిపి ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. నగదు లెక్కింపు సమయంలో భద్రతా లోపాలు, అనధికార ప్రవేశం జరిగినట్లు దర్యాప్తులో గుర్తించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నగదు లెక్కింపు కేంద్రాల్లో బయోమెట్రిక్‌ నమోదు, తప్పనిసరి తనిఖీలు, పోలీసు పర్యవేక్షణ వంటి అదనపు భద్రతా చర్యలు అమలు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -