2వేల నోట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం..

నవతెలంగాణ – హైదరాబాద్: గతేడాది మేలో రద్దు చేసిన రూ.2వేల నోట్లకు సంబంధించి ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. విలువైన రూ.2000 నోట్ల మార్పిడి కోసం పౌరుల‌కు మ‌రో అవ‌కాశం క‌ల్పించింది. దేశంలోని ఆర్‌బీఐ కార్యాలయాలు, పోస్టాఫీసుల వ‌ద్ద పెద్దనోట్లను మార్చుకోవ‌చ్చని తెలిపింది. అయితే ఇందుకు గడువును మాత్రం నిర్ణయించలేదని తెలిసింది. అయితే రూ.2000 నోట్లు మార్చుకునే పౌరులు ప్ర‌స్తుతం ఆన్‌లైన్‌లో ల‌భిస్తున్న ద‌ర‌ఖాస్తు ఫామ్ నింపి పోస్టాఫీసు ద్వారా ఆర్‌బీఐకి పంప‌వ‌చ్చని రిజర్వ్‌ బ్యాంక్‌ చెప్పింది. క్లీన్ నోట్ పాల‌సీలో భాగంగా గ‌తేడాది మే నెల‌లో రూ.2000 నోట్ల‌ను చ‌లామ‌ణి నుంచి ఉపసంహ‌రిస్తున్న‌ట్లు భారతీయ సెంట్రల్‌ బ్యాంక్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.
ఎలా మార్చుకోవాలి? 
ముందుగా ప్రజలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న అప్లికేషన్‌ ఫారమ్‌ను పూర్తిచేయాలి. ఆ తర్వాత  స్థానిక పోస్టాఫీసు నుంచి రూ.2000 నోట్లను ఆర్‌బీఐ ఇష్యూ ఆఫీసులకు పంపాలి. ఎఫ్‌ఏక్యూలో సమాచారం ప్రకారం ఒక వ్యక్తి పోస్టాఫీసు బేస్డ్‌ ఫెసిలిటీలతో పాటు 19 ఇష్యూ కార్యాలయాల్లో ఒకేసారి రూ.20,000 వరకు నోట్లను మార్చుకోవచ్చు.

Spread the love