అగ్నిప్రమాదంలో కార్మికుల ప్రాణాలు కాపాడిన బాలుడికి రేవంత్ రెడ్డి సన్మానం

నవతెలంగాణ-హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా నందిగామలో గత శుక్రవారం నాడు ఓ ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో 50 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. వారిలో చాలామంది కిటికీల్లోంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. కొందరు బయటికి రాలేక చిక్కుకుపోగా, ఓ బాలుడి సమయస్ఫూర్తి వారిని కాపాడింది. నందిగామకు చెందిన సాయిచరణ్ అనే బాలుడు ఎంతో సాహసోపేతంగా ఫార్మా కంపెనీ భవనంపైకి ఎక్కి తాడు కట్టడంతో, ఆ తాడును పట్టుకుని ఆరుగురు కార్మికులు సురక్షితంగా బయటికి రాగలిగారు. బాలుడు సాయిచరణ్ ను పోలీసులు, అగ్నిమాపకసిబ్బంది, ఇతరులు ఎంతగానో అభినందించారు. కాగా, సాయిచరణ్ సాహసానికి సంబంధించిన సమాచారం తెలంగాణకు సీఎంవోకు కూడా చేరింది. నేడు ఆ బాలుడ్ని తన కార్యాలయానికి పిలిపించిన రేవంత్ రెడ్డి ఘనంగా సన్మానించారు. బాలుడి తల్లిదండ్రులతోనూ రేవంత్ మాట్లాడారు. కార్మికులను కాపాడడంలో ప్రదర్శించిన తెగింపు వివరాలను రేవంత్ రెడ్డి బాలుడు సాయిచరణ్ ను అడిగి తెలుసుకున్నారు. బాలుడి ధైర్యసాహసాల పట్ల సీఎం ముగ్ధుడయ్యారు.

Spread the love