తొలి విడతగా ఓఆర్ఆర్ పరిధిలోని
నాలుగు చెరువుల అభివృద్ధి
మొత్తం మూడు విడతల్లో
రూ. 536.5 కోట్ల పనులకు ప్రతిపాదనలు
నవతెలంగాణ- సిటీ బ్యూరో
హైదరాబాద్ నగర పరిధిలోని సహజ వనరులు, చెరువుల సంరక్షణే ధ్యేయంగా అడుగులు వేస్తున్న హైడ్రాకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. ఓఆర్ఆర్ పరిధిలోని నాలుగు ప్రధాన చెరువుల పునరుద్ధరణ, సమగ్ర అభివృద్ధి (ఫేజ్-1 కోర్ పనులు) కోసం రూ.227.98 కోట్లు కేటాయిస్తూ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ సోమవారం (జీ.ఓ నెంబర్ 678) ఉత్తర్వులు జారీ చేశారు. హైడ్రా కమిషనర్ సమర్పించిన డీపీఆర్, కార్యాచరణ ప్రణాళికను పరిశీలించిన ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేసింది. ఈ పనులకు సంబంధించిన అంచనాలను హెచ్ఎండీఏ పరిశీలించి, ఐఐటీ హైదరాబాద్ (ఐఐటీ హైదరాబాద్) ద్వారా స్వతంత్ర సాంకేతిక విశ్లేషణ, క్షేత్రస్థాయి తనిఖీలను పూర్తి చేయించింది. ఐఐటీ హైదరాబాద్ ధ్రువీకరణ పత్రాల ఆధారంగా ఈ నిధుల మంజూరు ప్రక్రియ వేగవంతమైంది. ఈ నాలుగు చెరువుల సమగ్ర అభివృద్ధికి మొత్తం మూడు విడతల్లో రూ.536.5 కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదించగా, ప్రస్తుతం మొదటి విడత (కోర్ ఐటమ్స్) పనుల కోసం ప్రభుత్వం రూ. 227.98 కోట్లను మంజూరు చేసింది. ఈ నిధులతో చెరువుల పూడికతీత, గట్ల బలోపేతం, మురుగునీరు కలవకుండా మళ్లించడం వంటి అత్యవసర పనులను హైడ్రా ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. నిర్వహణ ఖర్చులకు అదనంగా రూ. 12.50 కోట్లు చెరువుల అభివృద్ధి నిధులతోపాటు, హైడ్రా ఏజెన్సీ రోజువారీ నిర్వహణ, కార్యాచరణ సహాయం కోసం బడ్జెట్ అంచనాలు 2026-27 నుంచి మరో రూ. 12.50 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం మరో జీఓ నెంబర్ 679 జారీ చేసింది. ఆర్థిక శాఖ బడ్జెట్ విడుదల ఉత్తర్వుల అనుగుణంగా ఈ నిధులను డ్రా చేసేందుకు హైడ్రా కమిషనర్కు పూర్తి అధికారాలు కల్పించింది. జీఓ ఆదేశాల ప్రకారం హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్, హైడ్రా కమిషనర్లు సంయుక్తంగా ఈ పనులను త్వరితగతిన ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది.
‘హైడ్రా’కు రూ.227.98 కోట్లు మంజూరు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



