నవతెలంగాణ-హైదరాబాద్ : పిఠాపురంలో తన మేనమామ, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ గెలుపు కోసం సినీ హీరో, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో ప్రచారం నిర్వహిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తి రాయి విసరడంతో జనసేన కార్యకర్త ఒకరు గాయపడ్డారు. తాటిపర్తి గ్రామానికి చెందిన నల్లల శ్రీధర్ అనే జనసేన కార్యకర్త తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన శ్రీధర్ను మంగళవారం సాయి ధరమ్ తేజ్ పరామర్శించారు. కొద్దిసేపు అక్కడ గడిపి జనసేన కార్యకర్తలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా వైసీపీ గూండాలకి గెలుపుతోనే సమాధానం ఇద్దామని సాయి పేర్కొన్నారు. కాగా, వైసీపీ వాళ్లే ఈ దాడి చేశారని జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.