– బీఆర్ఎస్ సీనియర్ నేత దుర్గాప్రసాద్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి సర్ధార్ సర్వాయి పాపన్న ప్రతీక అని బీఆర్ఎస్ సీనియర్ నేత దుర్గాప్రసాద్ రెడ్డి తెలిపారు. శుక్రవారం అంబర్పేట్ నియోజకవర్గంలోని అలీ కేఫ్ వద్ద సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 373వ జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ రెడ్డి మాట్లాడారు. సబ్బండ వర్గాలకు రాజకీయ,సామాజిక సమానత్వం కోసం పాపన్న నిర్వర్తించిన కషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.
కుల, మతాలకు తావు లేకుండా అన్ని వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలనే సమ సమాజ ప్రజాస్వామిక స్ఫూర్తితో ఆనాటి కాలంలోనే పాపన్న గౌడ్ పోరాడటం గొప్ప విషయమని అన్నారు. విశ్వకీర్తిని పొందిన పాపన్న గొప్పతనాన్ని స్మరించుకునేందుకు ప్రతిఏటా వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందన్నారు. కార్యక్రమంలో అంబర్పేట్ కార్పొరేటర్ విజరు కుమార్ గౌడ్, లింగమ్ గౌడ్, మల్లేష్ గౌడ్, మహేందర్ గౌడ్, అవినాష్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, ఎంఎస్ రెడ్డి, జమీల్, హబీబ్, రాఘవేందర్ రెడ్డి, లక్ష్మణ్ గౌడ్, నర్సింగ్, తదితరులు పాల్గొన్నారు.