నేడు సెంథిల్‌ బాలాజీకి శస్త్రచికిత్స

చెన్నై : ఈడీ అరెస్టు చేసిన తమిళనాడు మంత్రి వి.సెంథిల్‌బాలాజీకి ఈ నెల 21న ఇక్కడి ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో హృదయ సంబంధిత శస్త్రచికిత్సను చేయనున్నారు. ఈ విషయాన్ని తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి మా. సుబ్రమణ్యం మంగళవారం వెల్లడించారు. క్యాష్‌ ఫర్‌ జాబ్స్‌ కుంభకోణంలో గతవారంలో సెంథిల్‌బాలాజీని ఇడి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అదే రోజు సెంథిల్‌ గుండెపోటుకు గురికావడంతో ముందుగా అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తరువాత కోర్టు ఆదేశాలతో ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు.
‘సెంథిల్‌బాలాజీకి తప్పనిసరిగా శస్త్రచికిత్స చేయాల్సి ఉంది. కాబట్టి రేపు చేస్తున్నారు’ అని మంత్రి సుబ్రమణ్యం మంగళవారం విలేకరులకు తెలిపారు. ప్రభుత్వ వైద్యులు గుర్తించేవరకూ కూడా ‘క్రిటికల్‌ బ్లాక్స్‌’ గురించి సెంథిల్‌బాలాజీకి తెలియదని సుబ్రమణ్యం చెప్పారు. ప్రస్తుతం సెంథిల్‌బాలాజీ చికిత్స పొందుతున్న కావేరీ ఆసుపత్రే ఈ నెల 14న అతనికి బైపాస్‌ సర్జరీ చేయాలని తొలిసారి సూచించింది.

Spread the love