నవతెలంగాణ – పరకాల : పరకాల పట్టణానికి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆర్డీవో వెంకన్నను ఎస్ఎఫ్ఐ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పరకాల పట్టణంలోని విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలు అనేక సమస్యలతో సతమతమవుతున్నాయని, విద్యార్థుల పట్ల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు కోరారు.
ముఖ్యంగా శిథిలావస్థకు చేరుకున్న ప్రభుత్వ పాఠశాల భవనాలను తొలగించి, విద్యార్థుల భద్రత దృష్ట్యా నూతన భవనాలను నిర్మించాలని విన్నవించారు. అలాగే, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కనీస అవసరమైన తాగునీటి సదుపాయాన్ని కల్పించాలని, మౌలిక వసతులను మెరుగుపరచాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్, పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్, జిల్లా కమిటీ సభ్యుడు హేమంత్, పట్టణ కార్యదర్శి సాయి తేజ, ప్రవీణ్, బన్నీ తదితరులు పాల్గొన్నారు.



