సింగిల్ విండో డైరెక్టర్ రాజేశ్వర రావు సస్పెన్షన్.?

– సొసైటీ ఆదాయానికి విరుద్ధంగా వ్యాపారం చేసినందుకేనా.?
– ఆలస్యంగా వెలుగులోకి
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము సింగిల్ విండో డైరెక్టర్ మల్కా రాజేశ్వర రావు సొసైటీ ఆదాయానికి విరుద్ధంగా ప్రయివేటు ఎరువుల, విత్తనాల వ్యాపారం చేస్తున్నందుకు సస్పెన్షన్ అయినట్లుగా తెలిసింది. 1పీఏసీఎస్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసినప్పుడు సొసైటీ ఆదాయం పెంచడానికి, అభివృద్ధికి కృషి చేస్తాము, రైతులకు సొసైటీ ద్వారా ఎరువులు, విత్తనాలు సకాలంలో అందుబాటులో ఉంచుతామని ప్రతిజ్ఞ చేసిన విషయం విదితమే. అయితే రాజేశ్వర్ రావు పీఏసీఎస్ లో ఒక సింగిల్ విండో డైరెక్టరై ఉండి సొసైటీ ఆదాయానికి గండికొట్టేలా, సహకార చట్టానికి విరుద్ధంగా తాడిచెర్లలో ప్రయివేటుగా ఎరువుల, విత్తనాల వ్యాపారం చేస్తున్నట్లుగా, సొసైటీలో ఉన్న కొంతమంది సభ్యులు ఇటీవల ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. ఈ ఫిర్యాదు మేరకు భూపాలపల్లి డిసిఓ డి. శైలజ పూర్తి విచారణ చేపట్టి ఈ నెల 20న రాజేశ్వర్ రావును సహకార సంఘం యాక్ట్ 1964 ప్రకారం సస్పెన్షన్ చేసినట్లుగా ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. ఇదే రాజేశ్వర్ రావు గతంలో పీఏసీఎస్ అనుబంధ కేడీసీసీ బ్యాంక్ లో రూ.10 లక్షల అప్పు తీసుకొని సకాలంలో చేల్లించకపోగా డిపాల్టర్ అయిన విషయం తెలిసిందే.
Spread the love