నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ మాజీ చీఫ్, ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ హాజరు కావటంలేదు. అనారోగ్య కారణాలతో ఆమె తన టూర్ను రద్దు చేసుకున్నారు. ఈ వేడుకలకు ప్రత్యేక అతిథిగా హాజరు కావాలంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీకి వెళ్లి ఆమెను ఆహ్వానించారు. ఆయన ఆహ్వానాన్ని మన్నించిన సోనియా గాంధీ.. వేడుకలకు హాజరవుతానని మాటిచ్చారు. షెడ్యూల్ ప్రకారం ఆదివారం ఉదయం ఆమె హైదరాబాద్ చేరుకోవాల్సి ఉంది. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న సోనియా ఈ టూర్ విషయంలో తన వ్యక్తిగత వైద్యుడి సలహా తీసుకున్నారు. తన ఆరోగ్యం దృష్ట్యా ఈ ప్రయాణాన్ని మానుకుంటేనే మేలని వైద్యుడు చెప్పడంతో టూర్ను ఆమె రద్దు చేసుకున్నారు. అనారోగ్య కారణాలతో రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియా హాజరు కావడంలేదని ఏఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది