నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, తో కలిసి తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల నిర్వహణపై సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 2న జరుపుకొనే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లపై అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిందిగా సూచించారు.తెలంగాణ అవతరణ దినోత్సవం రోజున జాతీయ పతాకావిష్కరణలో భాగంగా కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు చర్యలు తీసుకోవాలని, ప్రముఖులకు, పుర ప్రముఖులకు, అతిథులకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఆహ్వాన పత్రాలను అందజేయాలని, ప్రోటోకాల్ (నిర్వహణ నియమాల)ను అనుసరిస్తూ ప్రముఖులు, మీడియా, తదితర సీటింగ్ గ్యాలరీలను జాగ్రత్తగా ఏర్పాటు చేయాలని, జిల్లా ప్రగతిపై రూపొందించే సందేశం కాపీలను సీపీఓ తయారు చేయాలని పేర్కొన్నారు.
సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను విద్యాశాఖ అధికారులు చేపట్టాలన్నారు. అలాగే జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని, విద్యుత్తు సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా నిరంతరం సరఫరా జరిగే విధంగా విద్యుత్ శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వకుండా సంబంధిత శాఖల అధికారులు తగు ఏర్పాట్లను ముందస్తు జాగ్రత్తలతో నిర్వహించాలని స్పష్టం చేశారు. తాగునీరు, స్నాక్స్ వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలని, అమరవీరుల స్థూపం, స్టేజ్ అలంకరణ లను పటిష్టంగా ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, భువనగిరి రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి,కలెక్టరేట్ ఏవో అంజి రెడ్డి,మునిసిపల్ కమిషనర్ లు, వివిధ శాఖల సంబంధిత జిల్లా అధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.



