– ప్రకటించిన కేసీఆర్
– అన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన గులాబీ పార్టీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. దీంతో గులాబీ పార్టీ రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్టైంది. కాగా హన్మకొండ జిల్లా వాసి, మాదిగ సామాజికవర్గానికి చెందిన డాక్టర్ సుధీర్ కుమార్ ఆ జిల్లా పరిషత్ చైర్మన్గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 2001 నుండి తెలంగాణ ఉద్యమకారుడిగా, బీఆర్ఎస్ పార్టీకి విధేయునిగా, అధినేతతో కలిసి పని చేస్తున్న సుధీర్ కుమార్ సరైన అభ్యర్ధి అంటూ ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ముఖ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ మేరకు అందరితో చర్చించి వారి సలహాలు, సూచనల మేరకు అధినేత కేసీఆర్, సుధీర్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన ఐదు సీట్లు పోగా మిగతా 12 సీట్లలో ఆరు సీట్లను బీఆర్ఎస్ బీసీలకు కేటాయించింది. మరో ఆరు స్థానాల్లో ఓసీ అభ్యర్థులను బరిలో నిలిపింది. మహబూబాద్ నుంచి మహిళా అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవితకే తిరిగి టిక్కెట్ ఇచ్చింది.
మొత్తం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా ఇదే
1. ఖమ్మం – నామా నాగేశ్వర్ రావు (ఓసీ).
2. మహబూబాబాద్ (ఎస్టీ) – మాలోత్ కవిత.
3. కరీంనగర్ – బోయినిపల్లి వినోద్ కుమార్ (ఓసీ).
4. పెద్దపల్లి (ఎస్సీ) – కొప్పుల ఈశ్వర్.
5. మహబూబ్ నగర్ -మన్నె శ్రీనివాస్ రెడ్డి (ఓసీ).
6. చేవెళ్ల- కాసాని జ్ఞానేశ్వర్ (బీసీ).
7. వరంగల్ (ఎస్సీ) – డాక్టర్ మారేపెల్లి సుధీర్ కుమార్.
8. నిజామాబాద్ – బాజి రెడ్డి గోవర్ధన్ (బీసీ).
9. జహీరాబాద్ – గాలి అనిల్ కుమార్ (బీసీ).
10. ఆదిలాబాద్ (ఎస్టీ) – ఆత్రం సక్కు (ఆదివాసీ).
11. మల్కాజ్ గిరి – రాగిడి లక్ష్మా రెడ్డి (ఓసీ).
12. మెదక్ – పీ వెంకట్రామి రెడ్డి (ఓసీ).
13. నాగర్ కర్నూల్ (ఎస్సీ) – ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
14. సికింద్రాబాద్- తీగుళ్ల పద్మారావు గౌడ్ (బీసీ).
15. భువనగిరి- క్యామ మల్లేశ్ (బీసీ).
16. నల్లగొండ – కంచర్ల కష్ణారెడ్డి (ఓసీ).
17. హైదరాబాద్ – గడ్డం శ్రీనివాస్ యాదవ్ (బీసీ).