నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో బెయిల్ మంజూరు చేయాలని హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ హైకోర్టులో మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. దీనిని జస్టిస్ లక్ష్మణ్ శుక్రవారం విచారించారు. సీబీఐ వాదనల నిమిత్తం విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు. గూగుల్ టేక్ అవుట్ ఆధారంగా నిందితుడిని ఇంతకాలంగా జైలులో ఉంచటం సుప్రీం కోర్టు తీర్పులకు విరుద్ధమని పిటిషనర్ లాయర్ వాదన. నిందితుడు దస్తగిరి వాంగ్మూలం తప్ప సునీల్ యాదవ్కి వ్యతిరేకంగా మరో ఆధారం లేదన్నారు.
ఇంతకాలంగా సునీల్ యాదవ్ ను జైల్లో ఉంచటం రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించడమేనని న్యాయవాది బి.రమేష్ వాదించారు. బెయిల్ ఇవ్వొద్దని వివేకా కుమార్తె సునీత న్యాయవాది వాదించారు. సీబీఐ వాదనల నిమిత్తం విచారణ సోమవారానికి వాయిదా పడింది.