వరల్డ్ కప్ ఫైనల్ కోసం అహ్మదాబాద్ చేరుకున్న టీమిండియా

నవతెలంగాణ – హైదరాబాద్: ఐసీసీ వరల్డ్ కప్ మెగా టోర్నీ చివరి అంకానికి చేరుకుంది. భారత గడ్డపై అక్టోబరు 5 నుంచి జరుగుతున్న ప్రపంచకప్ లో టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్ కు చేరుకున్నాయి. టైటిల్ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ నెల 19న జరగనుంది. ఈ నేపథ్యంలో, టీమిండియా అహ్మదాబాద్ చేరుకుంది. ఈ సాయంత్రం ముంబయి నుంచి బయల్దేరిన టీమిండియా ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం లభించింది. విమానాశ్రయం నుంచి ప్రత్యేక బస్సులో ఆటగాళ్లు తమకు కేటాయించిన హోటల్ కు వెళ్లిపోయారు. టీమిండియా ఆటగాళ్లు వస్తున్నారని తెలియడంతో అహ్మదాబాద్ లో ఎయిర్ పోర్టు నుంచి హోటల్ కు వెళ్లే రోడ్డుకు ఇరువైపులా అభిమానులు బారులు తీరారు. బస్సులో ఉన్న తమ అభిమాన క్రికెటర్లను చూస్తూ ఆనందంతో నినాదాలు చేశారు. టీమిండియా ఆటగాళ్లు రేపటి నుంచి ప్రాక్టీసు చేయనున్నారు. ఇవాళ రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై గెలిచిన ఆస్ట్రేలియా జట్టు రేపు అహ్మదాబాద్ చేరుకునే అవకాశం ఉంది.

Spread the love