తెలంగాణ గ్రూప్-2 పరీక్ష తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ

నవతెలంగాణ – హైదరాబాద్
తెలంగాణ గ్రూప్-2 పరీక్ష షెడ్యూల్ కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్. జనవరి 6, 7 తేదీల్లో పరీక్ష నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేయాలంటూ సోమవారం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనిత రామచంద్రన్ లేఖ రాశారు. పరీక్ష నిర్వహణకు సన్నద్ధమవ్వాలని, తగిన ఏర్పాట్లు చేయాలని అందులో పేర్కొన్నారు. కాగా గ్రూప్-2 పరీక్ష ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. పేపర్ లీకేజీ వ్యవహారం నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీని సమూలంగా ప్రక్షాళన చేయాలంటూ డిమాండ్లు తెరపైకి వచ్చాయి. అయితే ఇందుకు సంబంధించిన చర్యలు తీసుకునేలోపే ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో టీఎస్‌పీఎస్సీ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచిచూడాలి. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో భాగంగా జాబ్ క్యాలెండర్‌ను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అందులో ఏయే తేదీల్లో ఏయే పరీక్షలను నిర్వహించేది పేర్కొంది. మరి ఆ క్యాలెండర్ ప్రకారమే ముందుకెళ్తుందా? ఏమైనా మార్పులు ఉంటాయా? అనేది ఎదురుచూడాల్సి ఉంటుంది.

Spread the love